తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రతి దరఖాస్తును గడువులోగా పరిష్కరించాలి సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వినతులు, ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ అంకిత్ అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, డిఆర్ఓ పద్మావతి లతో కలసి స్వీకరించారు. భూ సంబంధిత వివాదాలు, రెవెన్యూ అంశాలు, సంక్షేమ పథకాల అమలు, ఉపాధి, పెన్షన్లు, గృహాలు, మౌలిక వసతులు, సామాజిక భద్రత తదితర సమస్యలను ప్రజలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, ప్రజావాణి కార్యక్రమం ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రభుత్వం కల్పించిన అత్యంత కీలక వేదిక అని అన్నారు. ప్రజల నుంచి అందిన ప్రతి వినతిని అత్యంత ప్రాధాన్యంతో పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యానికి ఎలాంటి అవకాశం ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి, సమస్య స్వభావాన్ని బట్టి సంబంధిత శాఖలకు వెంటనే పంపించి, గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్షణమే పరిష్కరించగల అంశాలను ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలని, క్లిష్టమైన సమస్యలపై నిరంతర పర్యవేక్షణతో బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శాఖల మధ్య సమన్వయం, సమర్థవంతమైన కార్యాచరణ ద్వారా ప్రజల సమస్యల పరిష్కారం వేగవంతమవుతుందని కలెక్టర్ అన్నారు . ప్రజావాణిలో స్వీకరించిన ప్రతి వినతిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ, పరిష్కార స్థితిని పరిశీలించాలని అధికారులకు సూచించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా ప్రతి శాఖ బాధ్యతాయుతంగా స్పందించి, ప్రభుత్వ సేవలను అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో అందించాలని తెలిపారు. ప్రజలు తమ వినతులతో పాటు అవసరమైన ఆధార పత్రాలను సమర్పిస్తే సమస్యల పరిష్కారం మరింత త్వరగా జరిగే అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు . ప్రజలకు పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పాలన అందించేందుకు ప్రతి అధికారి కృషి చేయాలని సూచించారు. ప్రజావాణిలో స్వీకరించిన కొన్ని వినతులు ● పాల్వంచ మండలం ఉల్వనూరు గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తూరు గ్రామానికి చెందిన గ్రామస్థులు తమ గ్రామంలోని పాత ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుని ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని, దానిని వెంటనే తొలగించి నూతన పాఠశాల భవనానికి ప్రహరీ గోడ మంజూరు చేయాలని కోరారు. అలాగే పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మొత్తం 52 మంది విద్యార్థులు ఉండగా ఒకే తరగతి గది ఉండటంతో బోధనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అదనపు తరగతి గదులు మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించారు. దీనిపై జిల్లా కలెక్టర్ అంకిత్ సంబంధిత అధికారులతో పరిశీలింపజేసి తగిన చర్యలు చేపట్టాలని జిల్లా విద్యాశాఖ అధికారికి ఎండార్స్ చేశారు. ● అన్నపురెడ్డిపల్లి మండలం పెంట్లం గ్రామంలోని కురుమబజార్ కాలనీకి చెందిన ప్రజలు తమ కాలనీలో ఉన్న చేతి పంపు మరమ్మతులకు గురై పనిచేయకపోవడంతో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రజలకు తాగునీరు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ వినతిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత ఎంపీడీవోకు ఎండార్స్ చేశారు. ● అన్నపురెడ్డిపల్లి మండలం అన్నపురెడ్డిపల్లి గ్రామంలోని బాలాజీనగర్ కాలనీవాసులు పెంట్లం సబ్స్టేషన్కు 132/33 కేవీ విద్యుత్ లైన్ నిర్మాణ పనులు గ్రామ శివారు నుంచి చేపట్టాల్సి ఉండగా కాలనీ మధ్యలో చేపడుతున్నారని, దీనివల్ల ప్రజలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. విద్యుత్ లైన్ నిర్మాణాన్ని కాలనీ మధ్య నుంచి కాకుండా గ్రామ శివారు నుంచి చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సమర్పించిన వినతిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ తగు చర్యల నిమిత్తం సంబంధిత విద్యుత్ శాఖ ఈఈకు ఎండార్స్ చేశారు. ● గుండాల మండలం కొడవటంచ గ్రామానికి చెందిన బొమ్మల లాలుప్రసాద్ తనకు వారసత్వంగా వచ్చిన మూడు ఎకరాల ఒడ్డు భూమిపై అధికారులు సర్వే నిర్వహించినప్పటికీ ఇప్పటివరకు పట్టా మంజూరు కాలేదని, సంబంధిత భూమిపై పట్టా మంజూరు చేసి న్యాయం చేయాలని వినతిపత్రం సమర్పించారు. దీనిపై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ