తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా అమలు చేయాలని సాధారణ పరిశీలకులు వి. సర్వేశ్వర రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఐడిఓసి కార్యాలయం నుండి తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఏ ఓ లు, ఏ ఈ ఓ లు,పోలీస్ శాఖ అధికారులు, ఎన్నికల సంబంధిత విభాగాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ఎన్నికల వ్యయ పరిశీలకులు పి. లావణ్య, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన , జెడ్పీసీఈఓ నాగలక్ష్మి పాల్గొన్నారు.ఈ సందర్భంగా సాధారణ పరిశీలకులు సర్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో సాగేందుకు కఠిన చర్యలు తప్పనిసరిగా చేపట్టాలని స్పష్టం చేశారు. గ్రామాలు, మండలాల వారీగా ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న పరిస్థితులను అధికారులు ఎలా పర్యవేక్షిస్తున్నారో వివరాలు తెలుసుకున్నారు. ఎఫ్ఎస్టిఎస్, ఎస్ఎస్టి, విఎస్టి, వి వి టి బృందాలు నిరంతర పర్యవేక్షణ చేయాలని, ఎన్నికలతో సంబంధం ఉన్న చట్టవిరుద్ధ చర్యలను తక్షణమే అరికట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా మద్యం, నగదు, బహుమతుల పంపిణీ వంటి ప్రలోభాలను అడ్డుకోవాలని స్పష్టం చేశారు. ఏ రకమైన అక్రమాలు చోటుచేసుకుంటే కఠినంగా వ్యవహరించాల్సిందిగా అన్ని విభాగాల అధికారులకు సూచించారు. ఏకగ్రీవం అయిన స్థానాలలో ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు సంబరాలు జరగకుండా చర్యలు చేపట్టాలని, ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేంతవరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందని అభ్యర్థులకు అవగాహన కల్పించాలని అన్నారు.ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశను వీడియో రికార్డింగ్ చేయాలని అధికారులకు సూచించిన పరిశీలకులు, బృందాలు గ్రామాలు, చెక్పోస్టులు, సున్నిత ప్రాంతాలను క్షేత్రస్థాయిలో సందర్శించి నిరంతర పర్యవేక్షణ చేయాలని అన్నారు.ఎన్నికలు స్వచ్ఛంగా, నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా జరుగేలా ఏ చిన్న లోపానికీ తావివ్వకుండా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.ఈ సమీక్షా సమావేశంలో హాజరైన అధికారులను తాము విధుల్లో నిర్లక్ష్యం చూపకూడదని , ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా ఎన్నికల నిర్వహణలో నిబద్ధతతో పనిచేయాలని సాధారణ పరిశీలకులు సర్వేశ్వర రెడ్డి సూచించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ