తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మునగసాగు పై అధికారులకు మరియు రైతులకు ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో ఇల్లందు, టేకులపల్లి,ఆళ్లపల్లి, గుండాల మరియు లక్ష్మి దేవి పల్లి ఎంపీడీవోలు, ఏపీవోలు, ఎంఏవోలు, ఏ ఈ ఓ లు, టి ఏ లు, ఈసీలు, ఎఫ్ఏ లు మరియు రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ మునగ సాగు రైతులకు ఒక వరం అని అన్నారు. మనం మన పొలంలో పని చేసుకుంటూ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీ రూపంలో మరియు మెటీరియల్ రూపంలో మనకే డబ్బులు వచ్చే అద్భుతమైన అవకాశం మునగ సాగు ద్వారా ఉందని ఆయన తెలిపారు.ఒక ఎకరానికి 1000 మొక్కలు నాటితే ప్రతి మొక్కకు కనీసం 150 కాయలు కాసినచో 1000 మొక్కలకు 1,50,000 కాయలు వస్తాయి. ఇట్టి కాయలను రూపాయికి రెండు చొప్పున ( కేజీ ₹5 ) అమ్మినా 75 వేల రూపాయలు ఆదాయం వస్తుందని, అంతేకాకుండా ఎండబెట్టిన ఆకుల పొడి ద్వారా మరియు ఎండిన గింజల ద్వారా వచ్చు నూనె వలన అధిక ఆదాయం రైతుల కు లభిస్తుందన్నారు. అధికారులు రైతులకు మునగ సాగు పై అవగాహన కల్పించాలని, ప్రతి వంద మంది రైతుల్లో కనీసం ఐదుగురు మునగ సాగు చేపట్టేగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి రైతు కనీసం ఒక్క ఎకరం లో మునగ సాగు చేపట్టేలా అవగాహన కల్పించాలన్నారు.ఈ వారంలో మునగ శాఖకు రైతులు సన్నద్ధం కావాలని, లేకపోతే ఈ సీజన్ లో అవకాశం కోల్పోతామని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులు మరియు రైతులు మునగ సాగు చేయడం లో వచ్చే సమస్యలను అడిగి తెలుసుకుని, వారి సందేహాలను నివృత్తి చేశారు.ఈ సందర్భంగా రైతులు మునగ సాగు పంట లాభదాయకమని కానీ వాటి మార్కెటింగ్ చేయుటకు తగు ప్రోత్సాహాన్ని కల్పించాలని, మునగ సాగులో కలుపు తీయుటకు సరైన యంత్రాలు కల్పించాలని, మునగ ఆకు పొడి చేయుటకు ఉపయోగించు యంత్రాలపై అవగాహన కల్పించాలని,పోడు భూముల్లో మునగ సాగు చేపట్టే రైతులకు బోర్ వేసుకునేలా అటవీశాఖ అధికారుల నుంచి అనుమతులు వచ్చేలా తగు చర్యలు చేపట్టాలని కలెక్టర్ కు విన్నవించారు. దీనికి కలెక్టర్ ఆరుగాలం కష్టపడి సాగు చేసిన రైతు కు సరైన మార్కెటింగ్ అవకాశాలను కల్పిస్తామని, పోడు భూముల్లో సాగు చేసే రైతులకు బోర్ అనుమతుల కోసం అటవీ శాఖ అధికారులతో మాట్లాడుతామన్నారు. మునగ సాగు లో జిల్లాలోని రైతులందరూ ఆదర్శ రైతులుగా ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని, రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామన్నారు. ఇప్పుడు మనం ధైర్యం చూపించే సమయం వచ్చిందని, మునగ సాగుపై అవగాహన పెంచుకొని, మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజీఎస్ మరియు ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకొని రైతుల స్వతంత్రులుగా అభివృద్ధి చెందాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి కిషోర్ మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ