తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రొంపేడు గ్రామంలో 33/11 కె.వి. విద్యుత్ ఉపకేంద్రానికి శంకుస్థాపన .ముత్యాలంపాడు క్రాస్ రోడ్ వద్ద నూతన 33/11 కె.వి. విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించి ప్రజలకు అంకితం. విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా మౌలిక సదుపాయాల విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యం. 1912 టోల్ ఫ్రీ సేవలు, పవర్ అంబులెన్స్లతో విద్యుత్ సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు. సింగరేణి అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమం, గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణతో అన్ని శాఖలు సిద్ధంగా ఉండాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్కకు జిల్లా కలెక్టర్ అంకిత్ మర్యాదపూర్వకంగా పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు.అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇల్లందు మండలం రొంపేడు గ్రామంలో నూతనంగా 3కోట్ల 25 లక్షల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న 33/11 కె.వి. విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయగా, టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్ రోడ్ వద్ద నూతనంగా నిర్మించిన 33/11 కె.వి. విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు.ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించేందుకు కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేస్తూ విద్యుత్ మౌలిక సదుపాయాలను వేగంగా విస్తరిస్తున్నట్లు తెలిపారు. కొత్త విద్యుత్ ఉపకేంద్రాల ఏర్పాటు, విద్యుత్ లైన్ల ఆధునికీకరణ, ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాల పెంపు వంటి కార్యక్రమాలను ప్రాధాన్యతతో అమలు చేస్తున్నట్లు తెలిపారు .తెలంగాణ అభివృద్ధిలో సింగరేణి సంస్థ కీలక పాత్ర పోషిస్తోందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. సంస్థ అభివృద్ధి, ఉత్పత్తి సామర్థ్యాల పెంపు, ఉద్యోగుల సంక్షేమం, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా బొగ్గు వనరుల వినియోగం కోసం ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోందన్నారు. సింగరేణి ప్రాజెక్టుల ప్రభావిత నిర్వాసితులకు న్యాయం చేయడంతో పాటు ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.సింగరేణి కార్మికులతో పాటు విద్యుత్ రంగ సంస్థల ఉద్యోగుల భద్రత కోసం ప్రమాద బీమా పథకాలు అమలు చేస్తున్నామని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.1.20 కోట్ల ప్రమాద బీమా రక్షణ కల్పిస్తున్నట్లు తెలిపారు.గిరిజన ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం ఎస్టీ సబ్ప్లాన్ ద్వారా విస్తృత కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. పోడు భూముల హక్కులు పొందిన గిరిజన రైతుల వ్యవసాయాభివృద్ధి కోసం 'ఇందిరా సౌర గిరి జల వికాసం' పథకం ద్వారా ఉచిత సౌర విద్యుత్, బోర్ బావులు, పంపుసెట్లు, డ్రిప్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వివరించారు.వాతావరణ పరిస్థితుల్లో వస్తున్న మార్పుల కారణంగా రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతున్నప్పటికీ, ప్రజలకు ఎలాంటి అంతరాయం కలగకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందించేలా విద్యుత్ శాఖ అప్రమత్తంగా పనిచేస్తోందన్నారు.విద్యుత్ సమస్యల పరిష్కారానికి 1912 టోల్ ఫ్రీ సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. వైద్యరంగంలోని 108 అత్యవసర సేవల తరహాలో విద్యుత్ శాఖలో ప్రవేశపెట్టిన 'పవర్ అంబులెన్స్' సేవల ద్వారా ట్రాన్స్ఫార్మర్లు, వైర్లు, అవసరమైన పరికరాలు, సాంకేతిక సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందాలు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 165 పవర్ అంబులెన్స్లు ప్రజలకు సేవలందిస్తున్నట్లు వెల్లడించారు.ఎల్నినో ప్రభావంపై శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో అన్ని శాఖలు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. తాగునీటి వనరుల పరిరక్షణ, వన్యప్రాణులకు నీటి లభ్యత, వ్యవసాయ రంగానికి అవసరమైన చర్యలు, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల్లో అవగాహన కల్పించడంలో మీడియా, అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ జిల్లాలో విద్యుత్ మౌలిక సదుపాయాల విస్తరణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రొంపేడు, ముత్యాలంపాడు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నూతన విద్యుత్ ఉపకేంద్రాల ద్వారా విద్యుత్ సరఫరా వ్యవస్థ మరింత బలోపేతమై, విద్యుత్ లోడ్ సమతుల్యం కావడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు జిల్లా యంత్రాంగం విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయంగా పనిచేస్తుందని అన్నారు .ఈ కార్యక్రమాల్లో ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎన్పీడీసీఎల్) చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ రెడ్డి, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య, వైరా శాసనసభ్యులు రామదాస్ నాయక్, విద్యుత్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ