తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రామ భక్తునికి తావు లేదా! హనుమాన్ విగ్రహ తరలింపుపై తొలగని ప్రతిష్టంభన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం పరిధిలోని VK-7 ఇంక్లైన్ ప్రాంతంలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహం తొలగింపు, పునఃప్రతిష్ఠ అంశంపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. సింగరేణి సంస్థ ఆవిర్భావం నుంచే ఈ ఆలయానికి ప్రత్యేక అనుబంధం ఉందని భక్తులు పేర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో కాలనీలు అభివృద్ధి చెందిన సమయంలో, స్వామివారు భక్తులకు ధైర్యం, రక్షణ, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచారని వారి విశ్వాసం. ఓపెన్ కాస్ట్ గనుల విస్తరణతో కాలనీలు, కార్మికులను ఇతర ప్రాంతాలకు తరలించినప్పటికీ, దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు స్వామివారి దర్శనానికి వస్తూనే ఉన్నారు. ప్రస్తుతం గనుల అవసరాల దృష్ట్యా గుట్టపై చెక్కబడిన రాతి విగ్రహాన్ని వేరే ప్రదేశానికి తరలించడం అనివార్యమైంది. అయితే, పునఃప్రతిష్ఠ కోసం సరైన స్థలం ఎంపికలో ఆలస్యం జరుగుతుండటంతో భక్తుల్లో అసంతృప్తి నెలకొంది. అభివృద్ధికి వ్యతిరేకం కాదు – భక్తులు సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల ద్వారా ఖనిజ సంపదను వెలికితీసి దేశ అభివృద్ధికి తోడ్పడటంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రశంసనీయం అని భక్తులు అభిప్రాయపడుతున్నారు. సంస్థ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు తమకు ఎటువంటి వ్యతిరేకత లేదని స్పష్టం చేస్తున్నారు. అయితే, భక్తుల భావోద్వేగాలను గౌరవిస్తూ విగ్రహ తరలింపు ప్రక్రియను చేపట్టాలని, పునఃప్రతిష్ఠకు అనుకూలమైన స్థలం కేటాయించాలని ప్రధానంగా కోరుతున్నారు. జనావాసాలకు సమీపంలోనే స్థలం కావాలి విగ్రహ తరలింపుకు సింగరేణి యాజమాన్యం సహకరించేందుకు ముందుకు రావడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ జనావాసాలకు దూరంగా కాకుండా అందుబాటులో ఉండే ప్రదేశాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. VK-4 ఇంక్లైన్ కోల్ టెస్టింగ్ ల్యాబ్ సమీపంలో ఉన్న స్థలం అనుకూలమని భావిస్తూ, అదే ప్రదేశాన్ని కేటాయించాలని భక్తులు కోరుతున్నారు. భక్తులకు అనుకూలంగా లేని ప్రదేశంలో ఆలయం ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉండదని, అందరికీ సులభంగా చేరుకునే ప్రదేశంలో ఆలయం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని వారు పేర్కొంటున్నారు. అధికారుల అభిమతం ఏమిటో? సింగరేణి అధికారులు భక్తులతో పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ, కోరిన స్థలంపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఆలయ కమిటీ సభ్యులు మాత్రం మొదటి నుంచే తమ అభీష్ట ప్రదేశాన్ని కేటాయిస్తే ఆలయానికి పునర్వైభవం తీసుకురాగలమని చెబుతున్నారు. భక్తులు తమ డిమాండ్ను తెలియజేస్తూ విజ్ఞాపన పత్రం సమర్పించాలని నిర్ణయించారు. భద్రాద్రి శ్రీరామయ్య సన్నిధిలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామికి అనుకూలమైన స్థలం కేటాయించలేకపోవడం ఆశ్చర్యకరమని వారు వ్యాఖ్యానిస్తున్నారు. హిందూ బంధువులందరూ ఏకమై, శాస్త్రోక్తంగా విగ్రహ పునఃప్రతిష్ఠ చేసి ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. వివిధ సంఘాలు కూడా ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ ముందుకు రావడం గమనార్హం. తీర్మానం కోసం ఎదురుచూపులు శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ తరలింపు అంశం ప్రస్తుతం సింగరేణి అధికారుల నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఈ సమస్యకు వారు ఎలాంటి పరిష్కారం చూపిస్తారో చూడాలి.
Admin
తెలుగు వెలుగు టీవీ