తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కార్మికుల సంఖ్యను పెంచాలి.. లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రపురం గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద కొనసాగుతున్న ఏం ఐ ట్యాంక్ పనులను జిల్లా కలెక్టర్ అంకిత్ గురువారం పరిశీలించారు. గ్రామ శివారులో కొనసాగుతున్న ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్లిన కలెక్టర్ అక్కడ పనిచేస్తున్న కార్మికులతో మాట్లాడి వారికి వేతనాలు సకాలంలో అందుతున్నాయా, పనుల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయా అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. కార్మికులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు పూర్తి స్థాయిలో అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. ప్రస్తుతం ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో పనిస్థలాల్లో కార్మికులకు తాగునీరు, నీడ కోసం టెంట్లు, ప్రథమ చికిత్స పెట్టెలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పని సమయంలో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, కార్మికుల ఆరోగ్య రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఆక్టివ్ జాబ్ కార్డుల వివరాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మొత్తం 300 జాబ్ కార్డులు ఉండగా ప్రస్తుతం 146 మంది మాత్రమే పనులకు హాజరవుతున్నారని అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన కలెక్టర్, ఉపాధి హామీ పనులపై గ్రామస్థులకు మరింత అవగాహన కల్పించి అర్హులైన ప్రతి కుటుంబం నుంచి ఎక్కువ మంది పనులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కార్మికుల సంఖ్యను పెంచి గ్రామీణ కుటుంబాలకు ఉపాధి అవకాశాలు మరింత విస్తరించేలా చూడాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాస్టర్ కార్డు లు పరిశీలించి ఒక కుటుంబం నుంచి ఎంతమంది పనులకు వస్తున్నారు, పని దినాలు సక్రమంగా నమోదవుతున్నాయా అనే అంశాలపై అధికారులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. పనుల నిర్వహణలో పారదర్శకత పాటించాలని, ప్రతి కార్మికుడి హాజరు వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. ఉపాధి హామీ నిధులతో చేపడుతున్న పనులు గ్రామాభివృద్ధికి ఉపయోగపడేలా ఉండాలని, నీటి వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తూ పనులను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట సర్పంచ్ కంగాల అంజలి డిఆర్డిఓ విద్యాచందన, తాసిల్దార్ శిరీష, పంచాయతీ సెక్రటరీ సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ