తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తరగతి సమయాల్లో ఇతర కార్యక్రమాలు నిర్వహించొద్దు.ప్రయోగాత్మక విద్యపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచాలి. పరిశుభ్రత, ఆహార నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. టేకులపల్లి మండలంలోని తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ అంకిత్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యాబోధన, విద్యార్థుల హాజరు, తరగతుల నిర్వహణ, ప్రయోగశాలలు, భోజనం, పరిశుభ్రత, యూనిఫాంలు, వెల్నెస్ సెంటర్ తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. 8, 9, 10వ తరగతుల గదులను పరిశీలించిన కలెక్టర్ కొన్ని తరగతుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంపై ఆరా తీశారు. గ్రామసభ, విద్యార్థి పార్లమెంట్, స్కాలర్షిప్కు సంబంధించిన బ్యాంకు ఖాతాల ప్రారంభం వంటి కార్యక్రమాల కోసం విద్యార్థులు తరగతులకు దూరంగా ఉన్నట్లు అధికారులు వివరించారు. ఆర్ట్ అండ్ డ్రాయింగ్ తరగతిని పరిశీలించి బోధిస్తున్న అంశాలను తెలుసుకున్నారు. 8వ తరగతి లైబ్రరీ పీరియడ్కు బదులుగా స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తరగతి సమయాన్ని పూర్తిగా విద్యాబోధనకే కేటాయించాలని, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇతర కార్యక్రమాల్లో నిమగ్నం కాకుండా చూడాలని స్పష్టం చేశారు. గ్రామసభ, విద్యార్థి పార్లమెంట్, బ్యాంకు ఖాతాల ప్రారంభం, స్కౌట్స్ అండ్ గైడ్స్ వంటి కార్యక్రమాలను తరగతుల అనంతరం లేదా శనివారాల్లో నిర్వహించాలని ఆదేశించారు. విద్యా క్యాలెండర్ ప్రకారం ప్రతి పీరియడ్ను సక్రమంగా నిర్వహించి విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని సూచించారు.భౌతిక శాస్త్ర ప్రయోగశాలను పరిశీలించిన కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడి ప్రయోగాలపై వారి అవగాహనను తెలుసుకున్నారు. పాఠ్యాంశాలను కేవలం పుస్తకాలకు పరిమితం చేయకుండా ప్రయోగాత్మకంగా నేర్పడం ఎంతో ముఖ్యమని, ప్రతి విద్యార్థి ప్రయోగాల్లో స్వయంగా పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని సూచించారు. ప్రయోగశాలను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, ఆసక్తి పెంపొందించేలా బోధన సాగాలని అన్నారు.కొత్తగా చేరిన కొంతమంది విద్యార్థులకు యూనిఫాంలు ఇంకా అందలేదని ప్రిన్సిపల్ వివరించడంతో, అర్హులైన విద్యార్థులందరికీ యూనిఫాంలు త్వరగా అందేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.భోజనశాల, వంటగది, మరుగుదొడ్లను పరిశీలించిన కలెక్టర్ పరిశుభ్రత లోపాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల భోజనశాల, వంటగది, మరుగుదొడ్లు, పరిసరాలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. వంట సిబ్బందితో మాట్లాడి విద్యార్థులకు అందుతున్న ఆహారం వివరాలను తెలుసుకున్నారు. ప్రధాన వంట మనిషి అనారోగ్యంతో సెలవులో ఉన్నట్లు తెలియడంతో, విద్యార్థులకు భోజనంలో అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ వంట మనిషిని వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు.స్టోర్ రూమ్లోని కూరగాయలు, రిఫ్రిజిరేటర్లోని పాలు, పెరుగు నాణ్యతను పరిశీలించిన కలెక్టర్, ఫుడ్ సేఫ్టీ అధికారుల ద్వారా నాణ్యత పరీక్షలు నిర్వహించాలని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం మాత్రమే అందేలా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.అనంతరం పాఠశాలలోని వెల్నెస్ సెంటర్ను పరిశీలించిన కలెక్టర్ అక్కడ అందుబాటులో ఉన్న మందులను తనిఖీ చేశారు. మందుల నిల్వ, వినియోగానికి సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించి, విద్యార్థులకు అవసరమైన వైద్య సేవలు, మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విద్యాబోధన, ప్రయోగాత్మక విద్య, ఆహారం, పరిశుభ్రత, ఆరోగ్యం, హాజరు తదితర అంశాల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు తమ బాధ్యతలను పూర్తి జవాబుదారీతనంతో నిర్వహిస్తూ విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలని ఆదేశించారు.ఈ తనిఖీల్లో కలెక్టర్ వెంట తాసిల్దార్ వీరభద్రం, ఎంపీడీవో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ