తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సంస్థను కాపాడుతున్న అధికారుల పట్ల నిర్లక్ష్య వైఖరి వీడాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధికారుల నిరసన దీక్ష శిభిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించిన కూనంనేని సింగరేణి అధికారుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, వారి పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. అఖిల భారత బొగ్గుగనుల అధికారుల సంఘం (ఐఎంఓఏ) సింగరేణి శాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట సోమవారం అధికారులు నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సందర్శించి వారికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాత్రింబవళ్లు శ్రమించి సింగరేణి సంస్థను లాభాల బాటలో నడిపిస్తున్న అధికారుల పట్ల యాజమాన్యం, ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి వీడాలన్నారు. అధికారుల పే-రివిజన్, అలవెన్సులు, పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లాభాల్లో వాటా, మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి అధికారుల సమస్యలపై చొరవ చూపాలని, లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, నాయకులు వంగ వెంకట్, జె గట్టయ్య,కిష్టాఫర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ