తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీలు) బలోపేతం, గ్రామీణ జీవనోపాధి అవకాశాల విస్తరణ లక్ష్యంగా చేపట్టనున్న వివిధ భవనాల నిర్మాణాలు, భూమి సేకరణ, భూ పరిపాలన అంశాలపై మంగళవారం జిల్లా స్థాయి సమీక్ష సమావేశాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ నిర్వహించారు.ఐడీఓసీ కార్యాలయంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందనలతో కలిసి భద్రాచలం సబ్ కలెక్టర్ మృణల్ శ్రేష్ట, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, సెర్ప్ డీపీఎంలు, ఏపీఎంలు తదితర సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రతి గ్రామపంచాయతీలో ఎస్హెచ్జీ ఫెడరేషన్ భవనాల నిర్మాణానికి 200 చదరపు గజాల విస్తీర్ణంలో అనువైన ప్రభుత్వ భూమిని గుర్తించాలని ఆదేశించారు. ఈ భవనాలు పేద మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు ఉపయోగపడతాయని తెలిపారు. అవసరమైతే అదనపు భవనాల నిర్మాణానికి కూడా స్థల సేకరణ చేపట్టాలని సూచించారు.మండల కేంద్రాల్లో మండల సమాఖ్య (మండల సమైక్య) భవనాల నిర్మాణానికి అల్లాపల్లి, అన్నపురెడ్డిపల్లి, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, కరకగూడెం మండలాల్లో 400 చదరపు గజాల విస్తీర్ణంలో భూమిని గుర్తించాలని ఆదేశించారు. ఎంపీడీవోలు తహసీల్దార్లకు స్థల కేటాయింపుకు సంబంధించి తక్షణమే దరఖాస్తు చేయాలని తెలిపారు. చండ్రుగొండ, ఇల్లందు, ములకలపల్లి, ఆళ్లపల్లి, అన్నపురెడ్డిపల్లి, అశ్వరావుపేట మండలాల్లో ఆహార ధాన్య నిల్వ గోదాముల నిర్మాణానికి 450 చదరపు గజాల విస్తీర్ణంలో భూమి సేకరణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ గోదాములు వర్షాకాలంలో ధాన్యాన్ని సురక్షితంగా నిల్వ చేయడానికి దోహదపడతాయని అన్నారు. ప్రతి మండల కేంద్రంలో 200 చదరపు గజాల విస్తీర్ణంలో లైవ్లిహుడ్ వర్క్షెడ్ల నిర్మాణం ద్వారా మహిళా సంఘాలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, మహిళా సమాఖ్య భవనాల సమీపంలో అనువైన స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. స్థల సేకరణలో ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన స్కెచ్లు, అంచనాలు సిద్ధం చేయాలని సూచించారు. దాతల నుండి స్వీకరించే భూములను చట్టబద్ధంగా, నిబంధనల ప్రకారం మాత్రమే స్వీకరించాలని స్పష్టం చేశారు.రెండు రోజుల్లో స్థల సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని, పంచాయతీ సెక్రటరీలు, జీపీఓలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఇప్పటికే గుర్తించిన స్థలాలకు సంబంధించిన రెగ్యులరైజేషన్ అంచనాలను వెంటనే సమర్పించాలని తెలిపారు. భూభారతి పోర్టల్లో 60 రోజులకు మించి పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వారం రోజుల్లో పరిష్కరించాలని తహసీల్దార్లను ఆదేశించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) మ్యాపింగ్ను వేగవంతంగా పూర్తి చేయాలని, 70 శాతం కంటే తక్కువ మ్యాపింగ్ ఉన్న ప్రాంతాల్లో బీఎల్ఓల ద్వారా తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.భూ సేకరణకు సంభందించిన సర్వే పనులు వేగవంతం చేయాలని, జాతీయ రహదారులు, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు సంబంధించిన భూ సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. అలాగే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్, నవోదయ పాఠశాలలకు సంబంధించిన భూ సేకరణను పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలోని ఏడు మండలాల్లో చేపట్టనున్న రీ-సర్వే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమమని, భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ఇది దోహదపడుతుందని అన్నారు. జీ సర్వేలో భాగంగా భూ సంబంధిత పత్రాలు సరిచూడటానికి అవసరమైన పత్రాలు అందుబాటులో ఉండేలా గ్రామాల్లో టామ్టామ్, ప్రచారం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.ఆర్ఎస్ఆర్ విస్తీర్ణం కంటే అధికంగా ఉన్న భూములను గుర్తించి, ఆన్లైన్ పహానీల ఆధారంగా నివేదికలు తయారు చేసి, గ్రామ పరిపాలన అధికారులతో సమన్వయం చేసుకొని సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. ప్రతి మండలంలో ఉన్న ప్రధాన భూ సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను గుర్తించి, ప్రతి సంవత్సరం వరదలకు గురయ్యే ప్రాంతాలపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ భవనాల అవసరాలను గుర్తించి కేటాయింపులు సత్వరమే పూర్తి చేయాలని సూచించారు. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్కు అవసరమైన భూమిని సేకరించి ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా గ్రామాలకు ఆదాయం పెరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల సెన్సస్ సర్వే జాతీయ స్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో, చిన్న నీటిపారుదల వనరుల వివరాలను సేకరించి ఆన్లైన్ యాప్లో నమోదు చేయాలని, ఈ సర్వేను జనవరి 25లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు
Admin
తెలుగు వెలుగు టీవీ