తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : - ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలి - ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు దళితుల అభివృద్ధికే ఖర్చు చేయాలి - దళితుల సమస్యల పరిష్కారం కోసం డీహెచ్పీఎస్ నిరంతర పోరాటాలు - ఆగస్టు 3 కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేద్దాం - డి హెచ్ పి ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి భద్రాద్రి కొత్తగూడెం: రాజ్యాంగం కల్పించిన సమాన హక్కులు దేశంలోని ప్రతి పౌరుడికి అందుబాటులో ఉండాలని, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న దళితులకు గిరిజనులతో సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా రంగాల్లో సమాన అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని డీహెచ్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. డి హెచ్ పి ఎస్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక శేషగిరి భవన్ సిపిఐ కార్యాలయంలో సుంకిపాక ధర్మ అధ్యక్షతన మంగళవారం జరిగింది ఈ సందర్భంగా సలిగంటి మాట్లాడుతూ దళితుల హక్కుల పరిరక్షణ, అభివృద్ధి కోసం ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో దశాబ్దాల కాలంగా గిరిజనులతో పాటు నివసిస్తున్న దళితులు ఇప్పటికీ అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, భూమి, ఉపాధితో పాటు అనేక అంశాల్లో వెనుకబాటుతనం కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాన అభివృద్ధి ఫలాలను పొందేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో ప్రైవేట్ రంగంలో కూడా దళితులకు రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయడం కాలానుగుణ అవసరమని ఇందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మతం పేరుతో ఎస్సీలను ఇబ్బందులకు గురిచేయడం, వివక్షకు పాల్పడడం రాజ్యాంగ విలువలకు విరుద్ధమని, కులానికి మతానికి అసలు సంబంధం లేదని మత విశ్వాసం వ్యక్తిగత హక్కు అని, దానిని ఆధారంగా చేసుకుని ఎస్సీ హోదా రద్దవుతుందని బెదిరింపులకు పాల్పడటం సరైనది కాదన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు దళితుల సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కేటాయించినవని, వాటిని ఇతర అవసరాలకు మళ్లించడం వల్ల దళితుల పురోగతికి తీవ్ర నష్టం కలుగుతోందని, ఎస్ సి సబ్ ప్లాన్ నిధులు దళితుల సమగ్రాభివృద్ధి కోసం వినియోగించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఆర్థిక స్వావలంబన ద్వారానే దళిత సమాజం అభివృద్ధి సాధ్యమవుతుందని, దళితుల సమస్యల పరిష్కారం కోసం డీహెచ్పీఎస్ నిరంతరం ఉద్యమాలు, ఆందోళనలు నిర్వహిస్తూ ప్రభుత్వ దృష్టికి సమస్యలను తీసుకెళ్తోందని తెలిపారు. దళితుల హక్కుల సాధన, పెండింగ్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆగస్టు 3న నిర్వహించనున్న కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలని సలిగంటి పిలుపునిచ్చారు. జిల్లాలోని దళితులు, యువత, మహిళలు, ప్రజాసంఘాల నాయకులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యమాన్ని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దళితుల ఐక్యతతోనే హక్కుల సాధన సాధ్యమవుతుందని, సమానత్వ సమాజ నిర్మాణానికి అందరూ కలిసికట్టుగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డి హెచ్ పి ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రత్రకుమారి జిల్లా అధ్యక్షులు దొంత మాల చెన్నయ్య నాయకులు మామిడాల ధనలక్ష్మి ఉరుసు రామకృష్ణ పాలమూరు శ్రీనివాస్ ఎర్రవెల్లి శంకర్ మండల రాజు ఇమ్మానియేల్ దార్ల లక్ష్మి చెరుకు సారయ్య తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ