తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కార్మిక, ప్రజా పక్షపాతి మేరుగు నర్సయ్య. నర్సయ్య మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటు.నిబద్ధత గల నాయకుడిని కోల్పోయాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. సిపిఐ, ఏఐటీయూసీ సీనియర్ నాయకులు మేరుగు నర్సయ్య మృతి ప్రజా, కార్మిక ఉద్యమాలకు తీరని లోటని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. కొత్తగూడెం పట్టణం, మథురబస్తికి చెందిన నర్సయ్య (70) అనారోగ్యంతో శనివారం మృతిచెందారు. విషయం తెలుసుకున్న సాబీర్ పాషా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వారి నివాసానికి చేరుకుని మృతదేహాన్ని సందర్శించారు. నర్సయ్య భౌతికకాయంపై పార్టీ ఎర్రజెండాను ఉంచి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన సతీమణి, మహిళా సమాఖ్య పట్టణ నాయకురాలు మెరుగు సరోజతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ.. నర్సయ్య జీవితాంతం కార్మికుల హక్కుల కోసం, పేదల సమస్యల పరిష్కారం కోసం నిస్వార్థంగా పోరాడారని కొనియాడారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజా సమస్యలపై ఎన్నో ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న నిబద్ధత కలిగిన నాయకుడని గుర్తుచేశారు. ఆయన చూపిన ఉద్యమ బాటలోనే కార్మిక వర్గ సమస్యలపై పోరాటాలను ముందుకు తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. నివాళులర్పించిన వారిలో నాయకులు రేసు ఎల్లయ్య, దారా లక్ష్మి, వంగ వెంకట్, డి శేషయ్య, లింగేశ్, జోసెఫ్, నల్లా శ్రీను, పిడుగు శ్రీనివాస్ తదితరులు వున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ