తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నెల రోజుల్లో సమస్యకు శాశ్వత పరిష్కారం కార్మికుల వారసుల దీక్షల విరమణ సమస్యను పరిష్కరించకుంటే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం డిస్మిస్డ్ కార్మికులనూ మానవతా దృక్పథంతో చూడాలి : కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సింగరేణి సంస్థలో మారుపేర్లతో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను నెల రోజుల్లో పరిష్కరించేందుకు యాజమాన్యం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిందని, ఈ నిర్ణయంతో కార్మికుల వారసులకు న్యాయం జరుగుతుందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట అలియాస్ పేర్ల బాధితులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలను సోమవారం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సింగరేణి పర్సనల్ జనరల్ మేనేజర్ కిరణ్ కుమార్ బాధితులకు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పూర్వం కార్మికులు దొరకని రోజుల్లో ఉద్యోగాల్లో చేరినప్పుడు పేర్లలో తప్పులు దొర్లాయని, దీనివల్ల నేడు వారి పిల్లలకు ఉద్యోగాలు రాక తీవ్ర మానసిక ఆందోళన చెందుతున్నారన్నారు, తప్పుడు పేర్లు ఉన్నాయని సింగరేణి విజిలెన్సు విభాగం విచారణపేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. విజిలెన్సు విచారణలో ఉండటంతో వారసులకు యాజమాన్యం ఉద్యోగాలు ఇవ్వండంలేదన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం కోల్ బెల్ట్ ఎమ్మెల్యేల సమావేశంలో యాజమాన్యంతో చర్చించామని తెలిపారు. ఫలితంగా ముగ్గురు యాజమాన్య ప్రతినిధులు, ఇద్దరు ఏఐటీయూసీ, ఒకరు ఐఎన్టీయూసీ ప్రతినిధులతో కూడిన ఆరుగురు సభ్యుల కమిటీని యాజమాన్యం ఏర్పాటు చేసిందన్నారు. ఈ కమిటీ నెల రోజుల్లో సమస్యను అధ్యయనం చేసి పరిష్కార మార్గాన్ని చూపుతుందని ఆయన స్పష్టం చేశారు. యాజమాన్యం ఇచ్చిన హామీ మేరకు నెలరోజుల్లో సమస్యను పరిష్కరించని పక్షంలో కార్మిక వారసుల ఉద్యమ కార్యాచరణ ప్రకటించి పోరాడతామని, ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి పరిస్కారానికి కృషిచేస్తానని స్పష్టం చేశారు. అలాగే గతంలో వివిధ కారణాలతో డిస్మిస్ అయిన కార్మికుల సమస్యను కూడా యాజమాన్యం మానవతా దృక్పథంతో పరిశీలించి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, యూనియన్ నాయకులు వంగ వెంకట్, జి వీరాస్వామి, శేషయ్య, రమణమూర్తి, గట్టయ్య, కిష్టాఫర్, సందెబోయిన శ్రీనివాస్, మాతంగి లింగయ్య, బండారి మల్లయ్య, నర్సయ్య, కార్మికుల వారసులు లక్క శ్రావణ్, ధనాల రాజేందర్, జె రాజేందర్, డిష్ బాబు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ