తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రతి ఇంటికి నాణ్యమైన త్రాగునీరు అందించడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిష్టాత్మక జల్ జీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా “జల్ శక్తి అంకల్” ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా స్థాయి త్రాగునీటి సరఫరా పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఫిబ్రవరి 1వ తేదీ నుండి 20 రోజులపాటు ప్రత్యేక కార్యాచరణగా జల్ శక్తి అంకల్ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి త్రాగునీటి సరఫరాలో ఉన్న లోపాలను గుర్తించి, వెంటనే పరిష్కరించేలా కార్యాచరణ రూపొందించామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి గ్రామ, మండల స్థాయిలలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో త్రాగునీటి సరఫరా పరిస్థితిని పరిశీలించి, ఎక్కడైనా సమస్యలు ఉన్నట్లయితే తక్షణమే గుర్తించి సమగ్ర నివేదికలు సమర్పించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలను గుర్తించి, వివరాలతో కూడిన నివేదికలు తయారు చేయాలని ఆదేశించారు. త్రాగునీటి సమస్య పరిష్కారానికి అవసరమైన చోట కొత్త వాటర్ ట్యాంకుల నిర్మాణం, మరమ్మత్తులు, అదనపు వనరుల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపారు. ప్రజలకు నీటి వృధా నివారణపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. రహదారుల వెంట, పైపులైన్ల ద్వారా జరుగుతున్న నీటి లీకేజీలను వెంటనే గుర్తించి మరమ్మత్తులు చేపట్టాలని ఆదేశించారు. రానున్న వేసవి కాలంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు కార్యాచరణ రూపొందించి, త్రాగునీటి సమస్యలు ఉత్పన్నం కాకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో విద్యాశాఖ అధికారి నాగలక్ష్మి, మిషన్ భగీరథ ఈఈ లు, తిరుమలేష్, నళిని, జిల్లా పంచాయతీ అధికారి సుధీర్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లెనినా అదనపు డిఆర్డిఓ రవి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ