తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలి: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు . ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలి. జిల్లాల వారీగా సూపర్ ఎల్నినో కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఇన్చార్జి మంత్రుల సమీక్షలకు శాఖల వారీ సమగ్ర నివేదికలతో హాజరు కావాలి. సూపర్ ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదై వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు కార్యాచరణ ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి సూపర్ ఎల్నినో పరిస్థితులు, వర్షాభావ నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, వ్యవసాయ ప్రణాళికలు, తాగునీటి నిర్వహణ, ప్రత్యామ్నాయ పంటల సాగు తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఐడీఓసీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి జిల్లా సూపర్ ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.రైతులకు పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించి పంటల మార్పిడి విధానాలను ప్రోత్సహించాలని, తక్కువ నీటి అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, సాంకేతిక సూచనలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు నిరంతరం అందుబాటులో ఉండాలని తెలిపారు.అదేవిధంగా జిల్లాల వారీగా వర్షపాతం పరిస్థితులు, సాగు విస్తీర్ణం, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక, తాగునీటి లభ్యత, పశుగ్రాసం, ఉపాధి హామీ పనులు, శాఖల వారీ కార్యాచరణ ప్రణాళికలపై సమగ్ర సమాచారాన్ని సిద్ధంగా ఉంచాలని సూచించారు. జిల్లా ఇన్చార్జి మంత్రులు, ప్రత్యేక అధికారులతో నిర్వహించనున్న సమీక్ష సమావేశాలకు అన్ని శాఖల అధికారులు పూర్తి స్థాయి నివేదికలతో హాజరు కావాలని ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ , జిల్లాలో ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖలతో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తూ ముందస్తు కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నామని తెలిపారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగు, నీటి పొదుపు పద్ధతులు, పంటల మార్పిడి, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే సాగు విధానాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, తాగునీటి సరఫరా, పశుగ్రాసం, ఉపాధి హామీ పనులు తదితర అంశాలపై కూడా సంబంధిత శాఖలు అప్రమత్తంగా పనిచేస్తున్నాయని తెలిపారు. ఎలాంటి పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్లో డి ఆర్ డి ఎ పి డి విద్యాచందన, హార్టికల్చర్ అధికారి కిషోర్ బాబు, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, గ్రౌండ్ వాటర్ ఏడి రమేష్, మున్సిపల్ కమిషనర్ సుజాత, డిపిఓ అనూష, సిపిఓ సునీత సంబంధిత శాఖ అధికారుల తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ