తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : భద్రాద్రి కొత్తగూడెం మార్చి 16 తెలుగు వెలుగు) : జూలూరుపాడు మండల పరిధి పడమట నర్సాపురం లో స్త్రీ శక్తి స్వరూపిణి అయిన పెద్దమ్మ తల్లి కొలుపు కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యింది. కొలుపు అనగా గ్రామదేవతలందరినీ ఒకే చోట చేర్చి మేళ్ల తాళాలతోటి ఆచార సాంప్రదాయంగా పూజించడాన్నే కొలుపు అంటారు. ఇది అనాదిగా శతాబ్దాల కాలం నుండి తరతరాలుగా ఆదివాసి గిరిజన నాయక పోడులు అనుసరిస్తూ, ఆచరిస్తూ, కొనసాగిస్తున్న సాంప్రదాయం. ఈ కొలుపు కార్యక్రమంలో ఆదివాసి నాయక పోడు గిరిజన పూజారులు ప్రధాన పాత్ర పోషిస్తారు. కొలుపు మొదలుకొని ముగింపు వరకు అన్ని కార్యక్రమాలు కటోర నియమనిష్టలతో ఆదివాసి సంస్కృతి, సాంప్రదాయాలతో నిర్వహిస్తారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో గ్రామ దేవత పెద్దమ్మ తల్లి, రాజు గొడుగులు, పోతురాజు, వీర ఖడ్గం, గణబాలలు, దేవరబాలలు, పూనకాల నడుమ గ్రామంలో కొలుపు కార్యక్రమం కోలాహాలంగా నిర్వహిస్తారు. కొలుపులో ప్రధానంగా పుట్ట బంగారం, బొడ్రాళ్ళు, కొలబియ్యం, సరువుల ఊరేగింపు, పట్నాలు, కళ్యాణం, కొండాలు తొక్కుట (అగ్నిపునీతం) ప్రధాన ఘట్టాలుగా నిర్వహిస్తారు. ఇలాంటి దైవ కార్యక్రమం నిర్వహణతో గ్రామ ప్రజలు, పశువులు, పంటలు, హానికరమైన వ్యాధులు రాకుండా, అంతా సుభిక్షంగా ఉండే విధంగా అమ్మ చూసుకుంటుందని ఆదివాసీల నమ్మకం. గ్రామంలో కొలుపు ఆఖరి రోజులైనా 21, 22 తారీకులలో అనగా శనివారం వనం (అడవి) నుండి సరువులు (మూడు సండ్ర చెట్లు) ను దేవతలకు ప్రతిరూపాలుగా భావించి గ్రామస్తులంతా కలసి ఊరేగింపుగా నగురు అనగా (దేవతను కూర్చోబెట్టి కొలిచే స్థలం) వద్దకు తీసుకొని వచ్చి వాటిని కాల్చి ఆదివారం ఉదయం ఆ నిప్పురవ్వలపై నడిచి తమ భక్తిని, విశ్వాసాన్ని నిరూపించుకోవడంతో ఈ కొలుపు ఘట్టం ముగిస్తుంది.
Admin
తెలుగు వెలుగు టీవీ