తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : ప్రజలకు మీసేవ ద్వారా అందిస్తున్న సేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ విధానాల అమలుపై ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు అధికారులకు అవగాహన కల్పించారు. శుక్రవారం కొత్తగూడెం తహసీల్దార్ పుల్లయ్య ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జీపీఓలు, ఆర్ఐలు, మీసేవ వీఎల్ఈలు, సెక్షన్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైదేశ్వరరావు మాట్లాడుతూ ఆదాయ, కుల, నివాస, కుటుంబ సభ్యుల ధృవపత్రాలు, ఈబీసీ, ఓబీసీ తదితర సేవలకు సంబంధించిన మీసేవ దరఖాస్తుల పరిశీలన పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే నిర్వహించబడుతుందని తెలిపారు. దరఖాస్తుదారులు సమర్పించిన డిజిటల్ పత్రాలను మాత్రమే పరిశీలించి నిబంధనల మేరకు ఆమోదం లేదా తిరస్కరణ నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. భౌతిక పత్రాలను స్వీకరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన GPOs & MRIs వెరిఫికేషన్ మొబైల్ అప్లికేషన్ వినియోగంపై అధికారులకు ప్రత్యేక శిక్షణ అందించారు. ఈ యాప్ ద్వారా దరఖాస్తుల పరిశీలనను సులభతరం చేసి నిర్ణీత గడువులోగా పరిష్కరించవచ్చని వివరించారు. ప్రతి దరఖాస్తును నిష్పక్షపాతంగా పరిశీలించి సకాలంలో పరిష్కరించాలని సూచించారు. మీసేవ కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వం నిర్ణయించిన రుసుములను మాత్రమే వసూలు చేయాలని, అదనపు రుసుములు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. దరఖాస్తుల నమోదు సమయంలో వివరాలను కచ్చితంగా నమోదు చేయడంతో పాటు డేటా ఎంట్రీలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంలో అధికారులు, మీసేవ కేంద్రాల నిర్వాహకులు సమన్వయంతో పనిచేయాలని, సాంకేతిక లేదా పరిపాలనా సమస్యలు ఎదురైతే సంబంధిత తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో జీపీఓలు, ఆర్ఐలు, మీసేవ వీఎల్ఈలు, సెక్షన్ అధికారులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ