తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ నెల 17 మరియు 18 తారీఖులలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఆధ్వర్యంలో జరుగునున్న గ్రూప్-3 కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను చేసినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఈ రోజు తెలియజేశారు. కొత్తగూడెంలోని 26 పరీక్ష కేంద్రాలు,పాల్వంచలోని 13 పరీక్షా కేంద్రాలు మొత్తం 39 కేంద్రాల వద్ద సుమారుగా 350 మంది పోలీసు అధికారులు మరియు సిబ్బందితో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు. ఈ నెల 17వ తారీఖున ఉదయం 10 గంటల నుండి 12.30 గంటల వరకు మరియు మధ్యాహ్నం 3 గంటల నుండి 5.30 గంటలకు పరీక్ష జరగనుంది.మరలా సోమవారం 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి 12.30 గంటల వరకు పరీక్షా సమయాన్ని నిర్ణయించారు.జిల్లా వ్యాప్తంగా 13,478 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ అభ్యర్థులకు పలు సూచనలు చేశారు.
పరీక్ష రాయడానికి పరీక్షా కేంద్రానికి వచ్చే అభ్యర్థులు ఉదయం 9.30 గంటలు లోపు, మధ్యాహ్నం అయితే 14.30 గంటల లోపు హాజరుకావాలి. తెలుపబడిన సమయాలకు పరీక్షా కేంద్రాల మెయిన్ గేట్లను మూసివేయడం జరుగుతుంది. అభ్యర్థులు ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి తీసుకుని రాకూడదు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇతర శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ పోలీస్ శాఖ పనిచేస్తుందని తెలిపారు. మంటను ప్రేరేపించే వస్తువులను గాని,ఇంకు బాటిల్స్ మరియు అనుమతి లేని యే ఇతర వస్తువులను తమ వెంట తీసుకురాకూడదు. మాల్ ప్రాక్టీస్ నకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారి నియమ నిబంధనల ప్రకారం అభ్యర్థులు నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రూప్-3 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఎటువంటి అపోహలకు,ఆందోళనకు గురికాకుండా పరీక్షకు హాజరుకావాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గ్రూప్ -3 పరీక్షా కేంద్రాల వద్ద విధులకు హాజరయ్యే అధికారులు మరియు సిబ్బందికి కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్ మరియు ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ లు సమావేశం ఏర్పాటు చేసి బ్రీఫింగ్ చేయడం జరిగింది.
Admin
తెలుగు వెలుగు టీవీ