తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూన్ 24 నుంచి జులై 25 వరకు ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ ఇంటింటి సర్వే నిర్వహణ ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి ప్రతి బుధవారం రాజకీయ పార్టీలతో సమీక్ష సమావేశాలు నిర్వహించాలి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి జిల్లాలో జూన్ 24 నుంచి జులై 25 వరకు చేపట్టనున్న ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ (ఎస్ఐఆర్) ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎస్ఐఆర్ మ్యాపింగ్ పురోగతి, ఇంటింటి సర్వే ప్రక్రియపై సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఐడీఓసీ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి సంబంధిత అధికారులతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియను జూన్ 24 నుంచి జులై 25 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బీఎల్ఓలు ఇంటింటి సర్వే నిర్వహించి ఎన్యూమరేషన్ ఫారాల ద్వారా ఓటర్ల వివరాలను సేకరిస్తారన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. జూన్ 15 నుంచి 22 వరకు ఇంటింటి సర్వే ప్రారంభానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని సూచించారు. జూన్ 24 నుంచి బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి ఫారాలను పంపిణీ చేసి వివరాలు నమోదు చేయాలన్నారు. ప్రజలకు తమ పరిధిలోని బీఎల్ఓల పేరు, మొబైల్ నంబర్, పోలింగ్ కేంద్రం వివరాలు తెలిసేలా విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా వీఐపీ, వీవీఐపీ ఓటర్ల పేర్ల మ్యాపింగ్కు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ప్రముఖుల పేర్లు ఓటరు జాబితాలో లేకపోవడం వంటి పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఫారం-6, 7, 8 ద్వారా అందిన దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి, మరణించిన ఓటర్ల వివరాలను ధృవీకరించి తొలగింపు ప్రక్రియ చేపట్టాలని సూచించారు. బదిలీ అయిన ఓటర్లు, మరణించిన ఓటర్ల వివరాలను సక్రమంగా పరిశీలించి రికార్డులను నవీకరించాలని తెలిపారు. ప్రతి బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తూ సమావేశాల మినిట్స్ను భద్రపరచాలని సూచించారు. ఎస్ఐఆర్ కార్యక్రమంపై బూత్ లెవల్ అధికారులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.ఐటీ బృందానికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని, బీఎల్ఓలు మొబైల్ యాప్ను తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకొని వినియోగించాలని తెలిపారు. ఒకే కుటుంబ సభ్యుల పేర్లు ఒకే పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. గత సమావేశం నుంచి ఇప్పటివరకు 17 వేల మ్యాపింగ్ పూర్తి చేశామని వెల్లడించారు. జిల్లాలో ప్రతి పోలింగ్ కేంద్రాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమన్వయం కొనసాగిస్తూ పారదర్శకంగా ప్రక్రియ నిర్వహిస్తామని తెలిపారు. బీఎల్ఓలకు అవసరమైన శిక్షణ, సాంకేతిక సహకారం అందిస్తూ సర్వే ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేస్తామని అన్నారు . ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఆర్డీవో మధు, ఎన్నికల సూపరింటెండెంట్ రంగప్రసాద్, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ