తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పండుగలు ప్రజల ఐక్యతకు దోహదం సంస్కృతీ సంప్రదాయాలు కాపాడుకుందాం యువత సేవా రంగంలో ముందుకు రావాలి : సిపిఐ జిల్లా కార్యదర్శి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎస్ కె సాబీర్ పాషా గంగా-జమునా తెహజీబ్తో విలసిల్లుతున్న కొత్తగూడెం పారిశ్రామిక ప్రాంతం మతసామరస్యానికి నిలయమని సిపిఐ జిల్లా కార్యదర్శి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎస్ కె సాబీర్ పాషా పేర్కొన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కొత్తగూడెం కార్పొరేషన్ 50వ డివిజన్, నెహ్రూ బస్తీలో ఎన్ఎమ్ సిసి ఆధ్వర్యంలో కొలువుదీరిన గణేష్ మండపాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. నిర్వాహకులు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజల మధ్య ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందించేందుకు పండుగలు, ఉత్సవాలు ఎంతో దోహదపడతాయన్నారు. మన పూర్వీకుల నుంచి వస్తున్న ఘనమైన సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత నేటితరంపై ఉందన్నారు. గత 18 సంవత్సరాలుగా ఎన్ఎమ్ సిసి కమిటీ అన్ని వర్గాల పండుగలను సమష్టిగా, వైభవంగా నిర్వహిస్తూ ప్రజా ఐక్యతను చాటడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. వేడుకలు సమాజంలో ఆత్మీయతను, పరస్పర ప్రేమానురాగాలను బలోపేతం చేస్తాయన్నారు. నేటి యువత కేవలం ఉత్సవాలకే పరిమితం కాకుండా బస్తీలోని ప్రజా సమస్యల పరిష్కారానికి, సామాజిక సేవా రంగాల్లో చురుగ్గా భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్ దాసరి శ్రీనివాస్, యెర్ర రాజు, కసరబోయిన రమేష్, పసుపులేటి భరత్, పొన్నం అజయ్, సాంబ, చోటు షరీఫ్, అంజాన్ రావు, వరప్రసాద్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ