తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వంశపారంపర్యంగా వైద్యం చేసే అందరూ ఏక తాటిపైకి నడిచి, ఆయుర్వేదాన్ని మరింత బలోపేతం చేయాలని పలువురు వక్తలు ఉద్ఘాటించారు. పారంపర్య వైద్య మహా సంఘం (పివిఎంఎస్) మూడవ రాష్ట్ర మహాసభలు భద్రాచలంలోని, భక్త మార్కండేయ భవన్లో మంగళవారం ప్రారంభమయ్యాయి. తొలుత మహాసభలకు ముందు ఆయుర్వేదానికి మూలపురుషుడైన ధన్వంతరిని స్మరించుకుంటూ, జ్యోతి ప్రజ్వలన గావించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ...భారతీయ సనాతన ఆయుర్వేద సిద్ధ వైద్య విధానాలు మన దేశం అంతటా వేల సంవత్సరాల నుంచి విస్తరించి ఉన్నాయన్నారు. దేశం పట్ల, దేశ ప్రజల పట్ల, అంకితభావం కలిగిన వైద్యులను వెలికి తీయాల్సిన అవసరం ఉందని వక్తలు పేర్కొన్నారు. మరుగున పడిన వైద్య గ్రంథాలను వెలు గులోకి తీసుకొచ్చి, వైద్యులందరినీ ఏకతాటిపై నడిపించడమే మహాసభలు ఉద్దేశమని తెలియజేశారు. ఔషధము లేని వ్యాధి ఉండకుండా, అంటే ప్రతి వ్యాధికి ఔషధం ఉండే విధంగా రూపకల్పన చేయడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడిన వారిలో భారత ధర్మ దేవత బ్రహ్మచారి శివ స్వామి (శివ క్షేత్ర పీఠాధిపతి), మానవీయ వైద్య జమాల్ ఖాన్, రామడుగు వీరభద్ర చారి, పర్యావరణవేత్త మొక్కల వెంకటయ్య లతో పాటు ఆంధ్రప్రదేశ్, మదురై, ఛత్తీస్గడ్, కేరళ, కర్ణాటక, ఒరిస్సా, తమిళనాడు లనుండి ప్రత్యేక ఆహ్వానితులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సభలో రాష్ట్ర అధ్యక్షులు దొంత యాత్రి మహా ఋషి, ఉపాధ్యక్షులు రామంచి శ్రీనివాస్, సిహెచ్ భాను ప్రసాద్, కోశాధికారి తోవేటి దుర్గారాణి, ఎస్కే వాహిద్ అలీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కన్వీనర్, జి.సుగుణారావు, కొ-కన్వీనర్ నాగేశ్వరరావు, తూము రమేష్, తదితరులు పాల్గొన్నారు. కాగా వేదిక మీద ఆసీనులైన వైద్యులకు ప్రకృతి ప్రేమికురాలు, హరిత దీక్షకురాలు చిన్నారి నైనిక రజవా మొక్కలను అందించి పలువురు ప్రశంసలు అందుకున్నారు. కాగా మహాసభలకు 500 రకాల ఔషధ మొక్కలను స్టాల్లో ఏర్పాటుచేసిన మొక్కల వెంకటయ్యను పలురు వైద్యుల అభినందించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ