తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గిరిజన యువతి హత్య అత్యంత హేయం.నిందితులను కఠినంగా శిక్షించాలి.బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి.మహిళల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గిరిజన యువతి (నర్సు) హైదరాబాద్ శివారు ప్రాంతంలో దారుణ హత్యకు గురికావడం అత్యంత హేయమైన చర్య అని, ఈ అమానుష ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా అన్నారు. ఈ ఈ ఘటనపై సోమవారం ఆయన మాట్లాడుతూ ఉపాధి కోసం వెళ్లి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పరిధిలోని తుక్కుగూడలో నర్సుగా సేవలందిస్తున్న గిరిజన బిడ్డపై దుండగులు పాశవికంగా దాడి చేసి హత్య చేయడం తీవ్రంగా కలచివేసిందన్నారు. మహిళలపై ఇలాంటి పైశాచిక దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ హత్యోదంతంపై సమగ్ర దర్యాప్తు వేగవంతం చేసి, బాధ్యులైన నిందితులను గుర్తించి ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా కఠినంగా శిక్షించాలని కోరారు. ఉస్మానియా ఆసుపత్రి వద్ద గిరిజన, ప్రజా సంఘాలు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలుపుతూ బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఎక్స్గ్రేషియా ప్రకటించి, అన్ని విధాలా న్యాయం చేయాలని ఆయన కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ