తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో అమలవుతున్న సంపూర్ణత అభియాన్ 2.0 లక్ష్యాలను జిల్లా స్థాయిలోను, గుండాల మండలంలోను సమన్వయంతో సాధిద్దామని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ జిల్లా, ఆస్పిరేషనల్ మండలం (ఆకాంక్షిత మండలం) కార్యక్రమంలో భాగంగా గురువారం గుండాల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో నిర్వహించిన సంపూర్ణత అభియాన్ 2.0 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముందుగా గుండాల గ్రామ కూడలి నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు. సంపూర్ణత అభియాన్ 2.0 క్యాంపెయిన్ను ప్రారంభిస్తూ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ క్యాంపెయిన్ జనవరి 28 నుంచి ఏప్రిల్ 14 వరకు నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో త్రాగునీరు, మరుగుదొడ్ల సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ప్రతి నెలా అంగన్వాడీ కేంద్రాల్లో నమోదు అయిన పిల్లల ఎత్తు, బరువు కచ్చితంగా కొలిచి నమోదు చేయాలని, పిల్లలను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.అంగన్వాడీ కేంద్రాల్లో నమోదు అయిన 6 నెలల నుంచి 6 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ బాలామృతం మరియు ఇతర పోషక ఆహారాన్ని తప్పనిసరిగా అందించాలని సూచించారు.గుండాల మండలంలోని గ్రామ సర్పంచులు తమ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి, పిల్లలకు అవసరమైన పోషకాహారం అందేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆశ మరియు ఏఎన్ఎంలు వ్యాధి నిర్ధారణ పరీక్షల ద్వారా క్షయ (టీబీ) బాధితులను గుర్తించి, వారికి అవసరమైన చికిత్స అందించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు.జిల్లా పశు వైద్య అధికారులు అన్ని పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయాలని ఆదేశించారు. అదే విధంగా గుండాల మండలంలో ఉన్న పశువుల సంఖ్య ఆధారంగా అవసరమైన పశుగ్రాసాన్ని రైతులు సాగు చేయాలని సూచించారు. దీనివల్ల పశువులకు సరిపడా మేత లభిస్తుందని తెలిపారు.ఈ సందర్భంగా సంపూర్ణత అభియాన్ 2.0 పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.సంపూర్ణత అభియాన్లో జిల్లాను, గుండాల మండలాన్ని ప్రథమ స్థానంలో నిలపడానికి అధికారులు సమష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు. క్షేత్రస్థాయిలో ఉద్యోగులు, అంగన్వాడీ సిబ్బంది, ఆశ కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పని చేసి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో హెల్త్ & న్యూట్రిషన్, విద్య, పశు వైద్య శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను జిల్లా కలెక్టర్ పరిశీలించి తగిన సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి నాగలక్ష్మి, సిపిఓ సంజీవ రావు, మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి లెనినా స్వర్ణలత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ తుకారాం నాయక్, జిల్లా పశు సంవర్థక శాఖాధికారి వెంకటేశ్వర్లు, గుండాల మండలం ఎంపీడీవో బాలరాజు, ఆస్పిరేషనల్ బ్లాక్ ఫెలో నవనీత్, అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ