తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పర్యావరణ పరిరక్షణ, భూగర్భ జలాల పెరుగుదల, పర్యాటక అభివృద్ధి దృష్ట్యా చిత్తడి నేలల సంరక్షణ అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. మంగళవారం ఐ.డి.ఓ.సి కార్యాలయం సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా వెట్ ల్యాండ్ కమిటీ సమావేశం జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్, అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ తో కలిసి నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న చిత్తడి నేలల గుర్తింపు, భౌగోళిక సరిహద్దుల నిర్ణయం, వాటి పరిరక్షణ, అభివృద్ధి, మరియు సుప్రీం కోర్టు ఆదేశాల అమలుకు సంబంధించిన అంశాలపై సమగ్రంగా చర్చ జరిగింది.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా చిత్తడి నేలల భౌగోళిక గుర్తింపు ప్రక్రియ వేగవంతం చేయడం అత్యవసరం. ఇందుకోసం అటవీ శాఖ, రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఇరిగేషన్, సర్వే విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్ణీత గడువులోపు గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలి అని తెలిపారు.జిల్లాలో ప్రాధమికంగా 50 చెరువులను ఎంపిక చేసి, వాటిపై సమగ్ర సర్వే నిర్వహించాలి. వాటి భౌగోళిక సరిహద్దులను ఖచ్చితంగా నిర్ణయించి, క్షేత్ర ధృవీకరణ చెయ్యాలని ఆదేశించారు . గుర్తించిన చిత్తడి నేలల పరిధిలో ఎటువంటి నిర్మాణాలు, మానవ జోక్యం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.చిత్తడి నేలలు పర్యావరణ సమతుల్యతకు కీలకమైన జీవ వ్యవస్థలు. ఇవి వర్షపు నీటిని నిల్వ ఉంచి భూగర్భ జలాలను పునరుత్పత్తి చేయడంలో, వన్యప్రాణుల నివాస స్థలాలుగా, మరియు పర్యాటక అభివృద్ధికి అనుకూల వాతావరణంగా పనిచేస్తాయి. అందువల్ల చిత్తడి నేలల స్వరూపాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత” అని అన్నారు.వెట్ ల్యాండ్ ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో పర్యాటక శాఖతో కలిసి చర్యలు తీసుకోవాలని సూచిస్తూ, పర్యావరణ అనుకూల ప్రాజెక్టులను రూపొందించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో సమావేశంలో ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా విద్యాచందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ సుజాత, జిల్లా పంచాయతీ అధికారి అనూష మరియు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ