తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి. ప్రజలకు చేరువగా ప్రజావాణి – మండలాల్లోనూ నిర్వహణ .సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వినతులు, ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అతను కలెక్టర్ విద్యా చందన, డి ఆర్ వో పద్మావతి తో కలసి స్వీకరించారు. భూ సంబంధిత వివాదాలు, రెవెన్యూ అంశాలు, సంక్షేమ పథకాల అమలు, ఉపాధి, పెన్షన్లు, గృహాలు, మౌలిక వసతులు, సామాజిక భద్రత తదితర సమస్యలను ప్రజలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రజావాణి కార్యక్రమం ప్రభుత్వం కల్పించిన ముఖ్యమైన వేదిక అని అన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి వినతిని అత్యంత ప్రాధాన్యంతో పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని ఆదేశించారు.ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యానికి ఎలాంటి అవకాశం ఉండకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, సమస్య స్వభావాన్ని బట్టి సంబంధిత శాఖలకు వెంటనే పంపించాలని సూచించారు. తక్షణమే పరిష్కరించగల సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని, క్లిష్టమైన సమస్యలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.శాఖల మధ్య సమన్వయంతో ప్రజల సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రజావాణిలో స్వీకరించిన ప్రతి వినతిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ, పరిష్కార స్థితిని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా ప్రతి శాఖ బాధ్యతాయుతంగా స్పందించి, ప్రభుత్వ సేవలను అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో అందించాలని తెలిపారు.జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని మండలాల్లో కూడా ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. మండల స్థాయిలోనే ప్రజలు తమ సమస్యలు, వినతులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందే అవకాశం ఉందన్నారు. ప్రజలు తమకు సమీపంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ప్రజలు తమ వినతులతో పాటు సమస్యకు సంబంధించిన అవసరమైన ఆధార పత్రాలను సమర్పిస్తే పరిష్కారం మరింత వేగంగా జరిగే అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రజలకు పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పాలన అందించేందుకు ప్రతి అధికారి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు కొన్ని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్లో నివాసం ఉంటున్న బానోత్ చంద్రమౌళి, తమ ప్రాంతంలోని రేషన్ షాపును స్థానికులకు కాకుండా స్థానికేతరులు నిర్వహిస్తున్నారని, రేషన్ షాపును స్థానికులకు అప్పగిస్తే ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని, దరఖాస్తు సమర్పించారు. ఈ దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు విచారణ, చర్యల నిమిత్తం తహసీల్దార్కు ఎండార్స్ చేశారు.టేకులపల్లి మండలం మద్రాస్ తండా గ్రామానికి చెందిన శరభ నరసింహారావు, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా రుణ సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నానని, తన దరఖాస్తు చాలా రోజులుగా పెండింగ్లో ఉందని, త్వరితగతిన దరఖాస్తును పరిశీలించి రుణం మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు. ఈ దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యల నిమిత్తం టేకులపల్లి ఎంపీడీవోకు ఎండార్స్ చేశారు.ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు, జోడిపంపుల వెనుక ప్రాంతానికి చెందిన ప్రజలు తమ ప్రాంతంలోని కొంతమంది ప్రభుత్వ ఆరడుగుల గల్లీని ఆక్రమించారని, దీంతో మున్సిపాలిటీ తాగునీటి పైపులైన్ ఏర్పాటుకు, అత్యవసర రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, గల్లీ ఆక్రమణలను తొలగించి సమస్యను పరిష్కరించాలని దరఖాస్తు సమర్పించారు. ఈ దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యల నిమిత్తం ఇల్లందు మున్సిపల్ కమిషనర్కు ఎండార్స్ చేశారు.ములకలపల్లి మండలం కమలాపురం గ్రామానికి చెందిన జక్కా యమున, కమలాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని చలమన్న నగర్లో అంగన్వాడీ ఆయా పోస్టు ఖాళీగా ఉండటంతో తాను దరఖాస్తు చేసుకున్నానని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా పూర్తయిందని, దరఖాస్తు చేసుకున్న వారిలో తానే మెరిట్ జాబితాలో ముందున్నానని పేర్కొంటూ తనకు అంగన్వాడీ ఆయా పోస్టు కల్పించాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు. ఈ దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యల నిమిత్తం మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారికి ఎండార్స్ చేశారు.చర్ల మండలం కంటేపల్లి గ్రామానికి చెందిన గోలి గోపయ్య, కంటేపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 1లో తనకు ఎకరం ఏడు కుంటల వ్యవసాయ భూమి ఉందని, ఈ భూమి తనకు వారసత్వంగా సంక్రమించిందని తెలిపారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా భూమిలో వ్యవసాయం చేయకపోవడంతో బీడు భూమిగా మారిందని తెలిపారు . తన వద్ద ఉన్న భూమికి సంబంధించిన పత్రాలను పరిశీలించి, పట్టాదారు పాస్బుక్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు. ఈ దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యల నిమిత్తం భద్రాచలం సబ్ కలెక్టర్కు ఎండార్స్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ అంకిత్ చేతుల మీదుగా తెలంగాణ ఓపెన్ స్కూల్స్ సొసైటీ వాల్పోస్టర్ ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ