తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (టెట్) మొదటి రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పూర్తిగా ప్రశాంతంగా ముగిశాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ కీలక పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసిందని ఆయన తెలిపారు.జిల్లాలో టెట్ పరీక్షల నిర్వహణ కోసం మొత్తం రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా పాల్వంచ అనుబోస్ ఇంజనీరింగ్ కాలేజ్ నందు ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో రెండు సెషన్లకు కలిపి 200 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా, మొదటి సెషన్కు 44 మంది, రెండవ సెషన్కు 38 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు.అలాగే అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ సైన్సెస్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో రెండు సెషన్లకు కలిపి 200 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా, మొదటి సెషన్కు 60 మంది, రెండవ సెషన్కు 74 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారని జిల్లా కలెక్టర్ వివరించారు.ఈ విధంగా మొదటి రోజు టెట్ పరీక్షలకు జిల్లాలో మొత్తం 400 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా, అందులో 216 మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షలకు హాజరై, 184 మంది అభ్యర్థులు గైహాజరు అయినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టినట్లు తెలిపారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. అలాగే పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 163 బి.ఎన్.ఎస్.ఎస్ సెక్షన్ అమలు చేస్తూ ప్రశాంత వాతావరణాన్ని కల్పించినట్లు ఆయన తెలిపారు.టెట్ పరీక్షల నిర్వహణలో పాల్గొన్న విద్యాశాఖ అధికారులు, కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, పర్యవేక్షకులు, సిబ్బంది, పోలీసు శాఖ అధికారుల సమన్వయంతో పరీక్షలు సజావుగా నిర్వహించగలిగామని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. మిగిలిన పరీక్షలు కూడా ఇదే విధంగా ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ