తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికలను ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా పూర్తిస్థాయిలో పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన తెలిపారు. శుక్రవారం పాల్వంచలోని అనుబోస్ కళాశాలలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు నియమితులైన పిఓ లు, ఏపీవోలు కు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియలో చిన్నపాటి తప్పిదం కూడా పెద్ద సమస్యలకు దారితీయవచ్చని అన్నారు. అందువల్ల ప్రతి పోలింగ్ అధికారి పూర్తి అవగాహనతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. పోలింగ్ ప్రారంభం నుంచి ముగింపు వరకు, అలాగే ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశను రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారం కచ్చితంగా అమలు చేయాలని తెలిపారు. ఓటింగ్ సామగ్రి నిర్వహణ, పోలింగ్ కేంద్రాల్లో శాంతిభద్రతలు, ఓటర్లకు కల్పించాల్సిన సౌకర్యాలు వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఎన్నికల విధుల్లో పారదర్శకత, నిష్పక్షపాతత్వం అత్యంత కీలకమని , ఎన్నికల కోడ్ను కఠినంగా పాటించాలని, ఎటువంటి అక్రమాలు లేదా అవకతవకలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. శిక్షణ కార్యక్రమంలో వివరించిన అంశాలను పూర్తిగా అవగాహన చేసుకుని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని ఆమె తెలిపారు. శిక్షణ సందర్భంగా పోలింగ్ అధికారులు (పీ.ఓలు), అసిస్టెంట్ పోలింగ్ అధికారులు (ఏ.పి.ఓలు) వ్యక్తం చేసిన సందేహాలను జిల్లా ఎన్నికల మాస్టర్ ట్రైనర్ పూసపాటి సాయి కృష్ణ సవివరంగా నివృత్తి చేసి, ఎన్నికల నిర్వహణపై స్పష్టత కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి శ్రీరామ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ