తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పంట కుంటల నిర్మాణాన్ని ప్రోత్సహించాలి – స్మార్ట్ రేషన్ కార్డులు, కొత్త పెన్షన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి వర్షాలు ఆశించిన స్థాయిలో కురవని నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేలా రైతులను చైతన్యపరచాలని, పంట కుంటల నిర్మాణాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వానాకాలంలో పంటల సాగు, వర్షాభావ పరిస్థితులు, సాగునీటి లభ్యత, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, కొత్త సామాజిక భద్రతా పెన్షన్ల మంజూరు, వన మహోత్సవం తదితర అంశాలపై శుక్రవారం హైదరాబాద్ నుండి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడీఓసీ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, సంబంధిత జిల్లా అధికారులతో కలిసి పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో మంత్రులు మాట్లాడుతూ, రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు ప్రస్తుతం వరద జలాలు వస్తున్నప్పటికీ రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న నీటి నిల్వలను, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రైతులకు పంటల ప్రణాళికపై స్పష్టమైన మార్గనిర్దేశం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాలువల కింద వరి సాగు చేసే ప్రాంతాల్లో వరద నీరు తగ్గిన తర్వాత పంట చేతికి వచ్చే వరకు సాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తే అవకాశమున్నందున రైతులకు ముందస్తుగా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ నెల 8వ తేదీన ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశాలు నిర్వహించి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని, భూగర్భ జలాల లభ్యత, విద్యుత్ సరఫరా, సాగునీటి పరిస్థితులపై సమగ్ర అంచనాలు రూపొందించి ప్రజాప్రతినిధులు, అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశాలున్నందున వచ్చే వేసవి వరకు తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని రైతులు తక్కువ నీటితో సాగు చేసే ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టేలా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా రైతుల ఆదాయం పెరగడంతో పాటు వాతావరణ మార్పుల ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని తెలిపారు. వన మహోత్సవం కింద నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా మొక్కల నాటకం పూర్తి చేయడంతో పాటు వాటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అలాగే ఆగస్టు 15వ తేదీ నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త సామాజిక భద్రతా పెన్షన్లు అందేలా చర్యలు వేగవంతం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అంకిత్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మండలాల వారీగా వర్షపాతం, నీటి లభ్యత, పంటల సాగు పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. రైతులకు క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారులు అందుబాటులో ఉండి నీటి లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల సాగు, పంటల వైవిధ్యీకరణపై అవగాహన కల్పించాలని సూచించారు. అందుబాటులో ఉన్న వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు పంట కుంటల నిర్మాణాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలని, రైతులు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. భూగర్భ జలాల పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టడంతో పాటు నీటి వినియోగంలో మితవ్యయం పాటించేలా రైతులకు సూచనలు చేయాలన్నారు. అదేవిధంగా ఆగస్టు 15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని పకడ్బందీగా నిర్వహించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త సామాజిక భద్రతా పెన్షన్లు అందేలా ప్రక్రియలను వేగవంతం చేయాలని, వన మహోత్సవం కింద నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత సంబంధిత శాఖలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన అన్ని కార్యక్రమాలను శాఖల మధ్య సమన్వయంతో సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి అనూష, సిపిఓ సునీత, ఉద్యానవన శాఖ అధికారి కిషోర్ పాటు సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ