తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఐక్య పోరాటాలతోనే బొగ్గు గనుల ప్రైవేటీకరణకు అడ్డుకట్ట సంస్థ మనుగడ, కార్మికుల భవిష్యత్తు కోసం నిరంతర కృషి కొత్త బొగ్గు బ్లాకుల సాధనకు ఉద్యమాలు తీవ్రతరం చేస్తాం : కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు మణుగూరు పీకేఓసి డిప్ సైడ్ బొగ్గు బ్లాక్ను సింగరేణి సంస్థకే కేటాయించడం ప్రభుత్వంపై తాను చేసిన వత్తిడి, కార్మికుల ఐక్య పోరాటాల ఫలితమేనని కొత్తగూడెం శాసనసభ సభ్యులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, సింగరేణి గుర్తింపుసంఘం గౌరవ అధ్యక్షులు కూనంనేని సాంబశివరావు అన్నారు. పీకేఓసి డిప్ సైడ్ బొగ్గు బ్లాక్ను సింగరేణి సంస్థకు అప్పగిస్తూ నిర్ణయం జరగడంపట్ల అయన హర్షం వ్యక్తం చేశారు. సింగరేణి పరిరక్షణ కోసం, సంస్థ మనుగడ కోసం చేపట్టిన వరుస ఆందోళనల వల్లే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందని పేర్కొన్నారు. పీకేఓసి డిప్ సైడ్ బ్లాక్ను సింగరేణికి దక్కేలా చూసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలతో పలుమార్లు చర్చలు జరిపినట్లు వెల్లడించారు. అలాగే సిపిఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన దశలవారీ ఉద్యమాలు, ఆందోళనలు ఈ విజయంలో కీలక పాత్ర పోషించాయని చెప్పారు. ప్రభుత్వ రంగాన్ని కాపాడుకునేందుకు కార్మిక లోకం ఐక్యంగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. సింగరేణి ఆస్తులను, గనులను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు జరిగిన కుట్రలను ఉద్యమ స్పూర్తితో తిప్పికొట్టామని స్పష్టం చేశారు. లాభాల బాటలో ఉన్న సింగరేణిని దెబ్బతీసే యత్నాలను ఏమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. ఈ విజయాన్ని కొందరు తమ గొప్పగా ప్రచారం చేసుకోవడం తీవ్ర హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో సింగరేణికి కొత్త బొగ్గు బ్లాకులు దక్కే వరకు తమ పోరాటం ఆగేది లేదని, సంస్థ ప్రయోజనాల కోసం నిరంతరం శ్రమిస్తామని ఆయన పునరుద్ఘాటించారు. మణుగూరులో ఏఐటీయూసీ, సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన పోరాట దృశ్యాలు (ఫైల్ ఫోటోలు పంపుతున్నాము..గమనించగలరు)
Admin
తెలుగు వెలుగు టీవీ