తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధ్యక్షతన శనివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో CIRG మక్దూం లో శిక్షణ పొందిన పశువైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ ఎం. వెంకటేశ్వర్లు, మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మత్తుర సమీపంలో CIRG మక్దూం లో మేకల పెంపకం, మేకపాలు మరియు వాటి ఉత్పత్తుల తయారీపై శిక్షణ పొందిన ముగ్గురు పశువైద్యాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో శాస్త్రీయ పద్ధతిలో మేకల పెంపకం, స్థానిక మేక జాతుల అభివృద్ధి, కృత్రిమ గర్భధారణ, మెరుగైన విత్తనపు పోతుల లభ్యత, పశుగ్రాస రకాలు మరియు దాణా మిశ్రమ పదార్థాల లభ్యత, సమయానుకూల ఆరోగ్య పరిరక్షణ చర్యలు వంటి అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మేకల పెంపకందారులకు అవగాహన కల్పించడం, షెడ్డు నిర్వహణ, పశుగ్రాస ఉత్పత్తి, అధిక మాంసకృతులు కలిగిన ఆహారం అందించడం, స్థానిక మేకల జాతుల జన్యు అభివృద్ధి వంటి అంశాలను పైలెట్ ప్రాజెక్టుగా ఒక గ్రామం నుంచి ఇద్దరు ఔత్సాహిక పశుపోషక రైతుల ద్వారా అమలు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసి తదుపరి సమావేశానికి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జి. ఆనందరావు (ప్రాథమిక పశువైద్య కేంద్రం, రామవరం), డాక్టర్ సిహెచ్. బాలకృష్ణ (ప్రాథమిక పశువైద్య కేంద్రం, సారపాక), డాక్టర్ వి. సంతోష్ (ప్రాథమిక పశువైద్య కేంద్రం, చండ్రుగొండ) పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ