తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం : సింగరేణి కార్మికవర్గానికి కొమురయ్య చేసిన సేవలు చిరస్మరణీయమని, నేడు కార్మికులు అనుభవిస్తున్న ప్రతి హక్కు వెనుక కొమురయ్య పోరాటం, త్యాగం ఉందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ మాజీ ప్రధాన కార్యదర్శి, యూనియన్ వ్యవస్థాపక సభ్యులు, తెలంగాణ సాయుధ పోరాట యోధులు మనుబోతుల కొమురయ్య 28వ వర్దంతిని ఏఐటియుసి, సిపిఐ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. సింగరేణి ప్రధాన కార్యాలయం, రుద్రంపూర్ ఏరియాలోని కొమురయ్య విగ్రహాలకు తొలుత యూనియన్, పార్టీ ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో కూనంనేని మాట్లాడుతూ సింగరేణిలో ఎనిమిది గంటల పనివిధానాన్ని సాధించిన ఘనత కొమురయ్యదేనన్నారు. విచ్చలవిడిగా కొనసాగుతున్న కాంట్రాక్టు విధానాన్ని కొమురయ్య పోరాటాల ఫలితంగానే వెనక్కు పంపించగలిగాడని, ఆనాడు బావుల్లో పనిచేసే మహిళా కార్మికులకు సర్ఫేస్ ఉద్యోగాలు కల్పించడంలో, పది సంవత్సరాలలోపు పిల్లలతో పనిచేయించుకునే విధానాన్ని వ్యతిరేకించిబాల కార్మిక వ్యవస్థకు అనాడే స్వస్థిపలికించాడని కొనియాడారు. రేగే, జాదవ్ కమిటీల ద్వారా, ముజుందాస్, దాస్గుప్తా, రఘునాథ్ రెడ్డి అవార్డుల ద్వారా, పలు జాతీయ వేతన ఒప్పందాలు, సమ్మెపోరాటాల ద్వారా కార్మికులకు ఎన్నో హక్కులు సాధించినపెట్టిన ఘనత కేవలం కొమురయ్యకే దక్కుతుందని పేర్కొన్నారు. నేటి పాలకులు, యాజమాన్యాలు తిరోగమనరీతిలో పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తూ కాంట్రాక్టీకరణ, ప్రైవేటీకరణవైపు పయనిస్తూ కార్మికులను కష్టాల్లోకి నెట్టుతున్నారని, వారి విధానాలకు చరమగీతం పాడటానికి సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు వాసిరెడ్డి సీతారామయ్య, కె.రాజ్ కుమార్, నాయకులు దమ్మలపాటి శేషయ్య, వంగ వెంకట్, జి. వీరస్వామి, జక్కుల గట్టయ్య, సముద్రాల సుధాకర్, కిష్టఫర్, రాము, మాతంగి లింగయ్య, అన్నెం లక్ష్మీనారాయణ, సత్యనారాయణ, ఆనంతలక్ష్మి, హుమాయున్, ఎస్ నాగేశ్వరరావు, కె. రాజేశ్వరరావు, మధు కృష్ణ, సందేబోయిన శ్రీనివాస్, సిపిఐ యువజన సంఘం జిల్లా నాయకులు బరిగెల భూపేష్, కొచ్చర్ల జోసెఫ్, యూనియన్ కొమరయ్య కుటుంబ సభ్యులు మనుబోతుల సత్యనారాయణ, మనుమరాలు సుష్మ, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ