తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడుమండల పరిధి పడమట నర్సాపురం గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పనులను గ్రామ సర్పంచ్ సంఘం లక్ష్మీ కుమారి ఏపీఓ రామారావు, గ్రామ కార్యదర్శి బి హారిక తో కలసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీఓ రామారావు ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ ప్రభుత్వ కొలతల ప్రకారం ప్రతి ఇద్దరూ నాలుగు మీటర్లు పొడవు, నాలుగు మీటర్లు వెడల్పు పనిచేస్తే ఒక్కొక్కరికి 307 రూపాయలు వేతనం ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. లేదా రోజుకు 8 గంటలు పనిచేయడం ద్వారా పై వేతనం పొందవచ్చునని అన్నారు. అదేవిధంగా ప్రతిరోజు పని ప్రారంభంలో, పని ముగిసే సమయంలో అందరి హాజరు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం నర్సాపురం పంచాయతీలో ఏడు గ్రూపులు, మూడు ప్రాంతాలలో మొత్తం 92 మంది పనిచేస్తున్నారని అన్నారు. గ్రూపుల హాజరు నమోదుకు నూతన మేట్ లను నియమించనున్నట్లు తెలిపారు. పనికి కావలసిన పలుగు, పార లు గ్రామాలకు సరఫరా చేయడం జరిగిందని, త్వరలోనే వాటిని పంపిణీ చేస్తామని అన్నారు. గ్రామంలో ఉపాధి హామీ జాబ్ కార్డ్ కలిగివున్న ప్రతి ఒక్కరూ పనిలో పాల్గొని ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలని కోరారు. కార్యక్రమంలో ఈసీ సైదులు, టిఏ నాగమణి, ఎఫ్ఏ రవి, సంఘం చిన్న రాజు తోపాటు, ఉపాధి హామీ కూలీలు, పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ