తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సీసీ కెమెరాలు, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన జూలూరుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన రోడ్ సేఫ్టీ గ్రామసభలో ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు జూలూరుపాడు ఎల్లంకి గార్డెన్స్ నందు ఏర్పాటు చేసిన రోడ్ సేఫ్టీ గ్రామసభకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ హెల్మెట్ వినియోగం,సీటు బెల్ట్ ప్రాధాన్యత,డిఫెన్సివ్ డ్రైవింగ్ నియమాల గురించి వివరించారు.రోడ్డు భద్రతా నియమాలను పాటించడంలో స్వీయ క్రమశిక్షణ కలిగి ఉంటే చాలావరకు రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని అన్నారు. గ్రామాలలో రోడ్డు సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేసుకొని రోడ్డు భద్రత పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. రోడ్డుపై విధులలో ట్రాఫిక్ పోలీసులు ఉన్నా,లేకపోయినా వాహనాలను నడిపేటప్పుడు నియమ,నిబంధనలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని కోరారు.డ్రంక్ అండ్ డ్రైవ్,ర్యాష్ డ్రైవింగ్,సెల్ఫోన్ డ్రైవింగ్,రాంగ్ రూట్,సిగ్నల్ జంపింగ్,ఓవర్ లోడ్ వలన కలిగే ప్రమాదాల గురించి వివరించారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలు నడుపుతూ కనిపించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. అనంతరం గ్రామాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని వాటి ప్రాముఖ్యత వివరించారు. గొడవలు, దొంగతనాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించడానికి కేసుల పరిష్కారానికి సహాయపడతాయని గ్రామ ప్రజలకు వివరించారు. అనంతరం సైబర్ నేరాలపై ఎస్పీ అవగాహన కల్పించారు.అత్యాశకు పోయి త్వరితగతిన డబ్బును సంపాదించాలనే ఆలోచనతో చాలామంది సైబర్ నేరాల బారిన పడి కష్టపడి సంపాదించిన నగదును కోల్పోతున్నారని తెలిపారు.చదువుకున్నవారే ఎక్కువమంది సైబర్ నేరాలు బారిన పడుతున్నారని తెలిపారు.ఓటీపి ట్రాప్,ఆన్లైన్ ట్రేడింగ్,సోషల్ మీడియాల ద్వారా ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాల గురించి వివరించారు. ప్రభుత్వ నిషేధిత గంజాయిని ఎవరైనా సరఫరా చేస్తున్నట్లుగానీ,సేవిస్తున్నట్లు గానీ తెలిస్తే వెంటనే పోలీసువారికి సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. చాలామంది యువత గంజాయి మత్తుకు బానిసలై తమ అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. ఎవరైనా గంజాయి సేవిస్తూ పోలీసులు పట్టుబడితే కేసు నమోదు చేయడమే కాకుండా జైలుకు పంపడం జరుగుతుందని తెలిపారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి ఒక్క పౌరుడు బాధ్యత. ప్రజల సహకారంతోనే నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దగలమని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ ,మోటారు వాహనాల అధికారి వెంకట రమణ, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,జూలూరుపాడు సీఐ శ్రీలక్ష్మి, ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు,ఎస్సైలు ,సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ