తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీల ప్రక్రియలో భాగంగా జిల్లాలోని పలు ఆరోగ్య ఉప కేంద్రాల్లో రెగ్యులర్ ఏఎన్ఎమ్లు విధుల్లో చేరిన నేపథ్యంలో, ఖాళీగా ఉన్న ఉప కేంద్రాలకు ఔట్సోర్సింగ్ ఏఎన్ఎమ్లను కేటాయించేందుకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. తుకారాం రాథోడ్ మాట్లాడుతూ, కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, సీనియారిటీ మరియు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి ఉప కేంద్రంలో ప్రజలకు నాణ్యమైన ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.నూతనంగా కేటాయించిన ఉప కేంద్రాల్లో ఔట్సోర్సింగ్ ఏఎన్ఎమ్లు వెంటనే విధుల్లో చేరి, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, శిశువులు, చిన్నారులకు అవసరమైన ఆరోగ్య సేవలు, టీకాల కార్యక్రమాలు, కుటుంబ నియంత్రణ సేవలు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులో సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.జిల్లాలోని ప్రతి ఆరోగ్య ఉప కేంద్రంలో ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా వైద్య సేవలు అందేలా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని డా. తుకారాం రాథోడ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో రామకృష్ణ సూపర్డెంట్ డిప్యూటీడెమో నాగలక్ష్మి డిపిఎంవోమోహన్, హెల్త్ సూపర్వైజర్లు శ్రీనివాసరావు, రాంప్రసాద్, జానకి సుశీల ఉమాదేవి విజయలక్ష్మి యూనియన్ నాయకులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ