తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బూత్ స్థాయి అధికారులకు (బీఎల్ఓ) గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలని, ఈ నెల 25వ తేదీ లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి సూచించారు. సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ, 1200 లకు పైగా ఓటర్లు ఉన్న చోట కొత్తగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అన్నారు. ఇదివరకు 1500 వరకు ఓటర్లు ఉంటే ఒక పోలింగ్ కేంద్రంగా ఏర్పాటు చేశామని, ప్రస్తుతం 1200 లోపు ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు కొత్తగా గుర్తించిన పోలింగ్ కేంద్రాలతో కూడిన ప్రతిపాదనల జాబితాను ఈ నెల 20వ తేదీ లోపు పంపించాలని కలెక్టర్లకు సూచించారు. అదేవిధంగా అవసరమైన చోట కొత్తగా బూత్ లెవెల్ అధికారులను నియమించాలని, వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా స్థానికులై ఉండాలని, ఒకవేళ అందుబాటులో లేని పక్షంలో అంగన్వాడీ కార్యకర్తలను నియమించవచ్చని తెలిపారు. ఎస్.ఎస్.ఆర్-2026 ప్రక్రియ కోసం చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని, ఈ నెల 15 వ తేదీ లోపు తమకు వివరాలు సమర్పించాలని సీఈఓ సూచించారు. వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కాశయ్య, ఎన్నికల సూపర్డెంట్ రంగ ప్రసాద్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సిబ్బంది నవీన్, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ