తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మార్చి 27, 28 తేదీలలో జరగనున్న శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం, మహా పట్టాభిషేక ఉత్సవాలకు సంబంధించి అన్ని శాఖల అధికారులు ముందస్తుగా అప్రమత్తమై, పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను సిద్ధం చేయాలని శనివారం సంబంధిత అధికారులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ సమీక్షా సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేశారు. రేపు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భద్రాచలంలో పర్యటించి ఏర్పాట్లపై సమీక్షించనున్న నేపథ్యంలో, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన పనులపై భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్టకు పలు సూచనలు చేశారు.ముఖ్యంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ పరిసరాలు, క్యూలైన్లు మరియు కళ్యాణ వేదిక వద్ద పారిశుద్ధ్య నిర్వహణకు పకడ్బందీ ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. భక్తుల దాహార్తిని తీర్చేందుకు తాగునీటి కుళాయిలు, వాటర్ ప్యాకెట్ల సేకరణ వంటి పనులను ముందస్తుగానే పూర్తి చేయాలని, ఆలయ ఈవో దామోదర్ రావు పర్యవేక్షణలో విద్యుదీకరణ, ఆలయ సుందరీ కరణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. భక్తుల ఆరోగ్య భద్రత కోసం వైద్య ఆరోగ్య శాఖ క్యూలైన్ల వద్ద వైద్య శిబిరాలను, అవసరమైన మందులు మరియు సిబ్బందిని సిద్ధం చేసుకోవాలని, ఏరియా ఆసుపత్రిలో అత్యవసర విభాగాలను అందుబాటులో ఉంచాలని సూచించారు.అగ్నిమాపక శాఖ వారు అవసరమైన ఫైర్ సేఫ్టీ పరికరాలతో సిద్ధంగా ఉండాలని, పోలీస్ మరియు ట్రాఫిక్ విభాగాలు సమన్వయం చేసుకొని వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక సెక్టార్లను ఇప్పుడే ఖరారు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. భక్తుల వసతి కోసం ఆన్లైన్ బుకింగ్, టికెట్ విక్రయాల ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించాలని, ఉత్సవ విధుల్లో పాల్గొనే సిబ్బందికి ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని తెలిపారు. ఏర్పాట్లలో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, ఎక్కడా ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా భక్తులకు భక్తి పరిపూర్ణమైన అనుభూతిని అందించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ