తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా స్థాయి రహదారి భద్రతా కమిటీ సమావేశంలో అధికారులకు ఆదేశాలు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి రహదారి భద్రతా కమిటీ సమావేశంలో కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో జిల్లాలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాలు, ప్రమాదాలు అధికంగా నమోదవుతున్న బ్లాక్ స్పాట్ల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రహదారులపై పశువుల సంచారం అధికంగా ఉండటం వల్ల, ముఖ్యంగా రాత్రి వేళల్లో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు . రహదారులపై పశువులను నిర్లక్ష్యంగా వదిలే యజమానులపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అతివేగంగా వాహనాలు నడపడం, మైనర్లకు వాహనాలు అప్పగించడం, సీటు బెల్టులు ధరించకపోవడం, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు వినియోగించకపోవడం వంటి ఉల్లంఘనలను అరికట్టేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, కట్టుదిట్టమైన అమలు చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 42 బ్లాక్ స్పాట్లలో భద్రతా చర్యలకు సంబంధించిన పనులను వచ్చే నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. బ్లాక్ స్పాట్ల వద్ద హెచ్చరికలు, సూచిక బోర్డులు, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన భద్రతా ప్రమాణాలు అమలు చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా రహదారుల వెంట ఏర్పడిన గుంతలను తక్షణమే పూడ్చివేయాలని, రహదారుల ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించి వాహనదారులకు స్పష్టమైన దృశ్యమానత కల్పించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారులపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు అవసరమైన భద్రతా చర్యలను వెంటనే చేపట్టాలని సూచించారు. ప్రమాదాలు సంభవించినప్పుడు క్షతగాత్రులకు 'గోల్డెన్ అవర్'లో సకాలంలో వైద్య సేవలు అందేలా బ్లాక్ స్పాట్లకు సమీపంలోని ఆసుపత్రులను మ్యాపింగ్ చేయాలని, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలో జనవరి నుండి ఇప్పటివరకు 289 రోడ్డు ప్రమాద కేసులు నమోదయ్యాయని అధికారులు వివరించారు. రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వివరాలను ఆన్లైన్ పోర్టల్లో ఎప్పటికప్పుడు నమోదు చేసి నవీకరించాలని సంబంధిత శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు వేణుగోపాల్, ఆర్ అండ్ బి ఈ ఈ నాగేశ్వరరావు, జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటరమణ, జిల్లా వైద్యశాఖ అధికారి తుకారాం రాథోడ్, జిల్లా పంచాయతీ అధికారి అనూష సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ