తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సర్వే పూర్తయ్యాకే దరఖాస్తు ఫారాలను యాప్లో అప్లోడ్ చేయాలి ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలి అన్నపురెడ్డిపల్లి మండలంలో బుధవారం జిల్లా కలెక్టర్ అంకిత్ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా అన్నపురెడ్డిపల్లి గ్రామంలోని పోలింగ్ స్టేషన్ నెం. 79 పరిధిలో చేపడుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను పరిశీలించడంతో పాటు గుట్టగూడెం గిరిజన ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పోలింగ్ స్టేషన్ నెం. 79ను పరిధిలో ఎస్ఐఆర్లో భాగంగా కొనసాగుతున్న డిజిటలైజేషన్ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. బూత్ లెవల్ అధికారులతో మాట్లాడి ప్రక్రియ పురోగతిపై ఆరా తీశారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా, పూర్తి పారదర్శకతతో, భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణీత గడువులోగా డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. గైర్హాజరైన ఓటర్లు, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా మారిన వారు, మరణించిన ఓటర్ల వివరాలను ప్రత్యేక జాబితాల రూపంలో సిద్ధం చేసి అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సర్వే పూర్తయిన అనంతరం మాత్రమే సేకరించిన దరఖాస్తు ఫారాలను యాప్లో అప్లోడ్ చేయాలని, ధృవీకరించని లేదా అసంపూర్ణ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అప్లోడ్ చేయరాదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అధికారులు జిల్లా కలెక్టర్కు ఎస్ఐఆర్ పురోగతిని వివరించారు. పోలింగ్ స్టేషన్ నెం. 79 పరిధిలో మొత్తం 1,012 దరఖాస్తు ఫారాల పంపిణీ పూర్తయిందని, ఇప్పటివరకు 128 ఫారాలను యాప్లో అప్లోడ్ చేసినట్లు తెలిపారు. మిగిలిన ఫారాలను కూడా సర్వే పూర్తిచేసి, క్షేత్రస్థాయిలో ధృవీకరించిన అనంతరమే యాప్లో అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ సందర్బంగా ప్రజలతో జిల్లా కలెక్టర్ నేరుగా మాట్లాడి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై ఆరా తీశారు. బూత్ లెవల్ అధికారులు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారా, అవసరమైన దరఖాస్తులు స్వీకరిస్తున్నారా, ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయా అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటరు వివరాలను పరిశీలించి, అవసరమైన మార్పులు, చేర్పులు, తొలగింపులు సకాలంలో చేయించుకోవాలని సూచించారు. అనంతరం అన్నపురెడ్డిపల్లి మండలం గుట్టగూడెం గిరిజన ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థుల నమోదు, హాజరు, విద్యాబోధన, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలపై ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం పాఠశాలలో మొత్తం 15 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయులు జిల్లా కలెక్టర్కు వివరించారు. అనంతరం విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. భోజన నాణ్యత, పరిశుభ్రత, మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్న తీరును తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు ప్రతిరోజూ పోషక విలువలు కలిగిన, నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మధ్యాహ్న భోజన నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. తరగతి గదులను పరిశీలించిన జిల్లా కలెక్టర్, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యార్థుల్లో అభ్యాస నైపుణ్యాలను పెంపొందించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు కృషి చేయాలని అన్నారు. అలాగే పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు మౌలిక సదుపాయాల నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ తనిఖీల్లో సంబంధిత అధికారులు, బూత్ లెవల్ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ