తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నేర నియంత్రణలో రాజీ ఉండదు.. పెండింగ్ కేసులు, సైబర్ నేరాల దర్యాప్తు, మహిళలు–చిన్నారుల భద్రతకు ప్రాధాన్యత జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఎస్పీ కార్యాలయం నుంచి వర్చువల్గా నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులతో జిల్లాలోని నేర పరిస్థితులు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతిపై సమీక్షించారు.ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నేరస్తులకు శిక్ష పడేలా చేసి బాధితులకు న్యాయం అందించాలని ఎస్పీ సూచించారు. కేసుల దర్యాప్తులో జాప్యం, నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, బాధ్యతారహితంగా వ్యవహరించే అధికారులపై క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు.మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, భరోసా కేంద్రం, షీ-టీమ్స్ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణా, వినియోగంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి హాట్స్పాట్లను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సైబర్ నేరాలపై ప్రజలకు నిరంతరం అవగాహన కల్పించాలని, సైబర్ మోసాలపై ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించి బాధితులకు అండగా నిలవాలని, కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని సూచించారు. సిసిటిఎన్ఎస్ 2.0లో పెండింగ్ వివరాలను సకాలంలో నమోదు చేయడంతో పాటు నాట్ గ్రిడ్ వినియోగాన్ని పెంచాలని తెలిపారు.రౌడీ షీట్లు, మిస్సింగ్ కేసులు, పోక్సో, ఎస్సీ/ఎస్టీ, మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. సీసీటీవీ నెట్వర్క్ను మరింత బలోపేతం చేసి కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు.డయల్-100కు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు సహాయం అందించాలని, పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటించాలని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్పై నిరంతరం వాహన తనిఖీలు చేపట్టి నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ వర్చువల్ సమావేశంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్, మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, ఇల్లందు డీఎస్పీ వెంకన్న బాబు, డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్య స్వామి, భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్తో పాటు జిల్లాలోని సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ