తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేయొద్దు.స్కిల్ వర్సిటీకి అనుసంధానం ఆపాలి.లాటరల్ ఎంట్రీ రద్దు నిర్ణయం సరికాదు.ప్రైవేటీకరణ కుట్రలను తిప్పికొడతాం. ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి జిల్లా సహాయ కార్యదర్శి వినయ్. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటమాడటం తగదని ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి మాణిక్యాల వినయ్ ధ్వజమెత్తారు. పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అనుసంధానం చేయడాన్ని నిరసిస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎదుట భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన విద్యా విధానం పేరుతో ప్రభుత్వ విద్యా రంగాన్ని కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టే కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. స్కిల్ యూనివర్సిటీ ముసుగులో పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలల ఆస్తులను ప్రైవేటీకరించడం పూర్తిగా అప్రజాస్వామికమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాల ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు ఈసెట్ ప్రవేశ పరీక్ష రాసే అర్హత కోల్పోయి, కార్పొరేట్ కంపెనీల్లో తక్కువ వేతనాలకే పనిచేసే పరిస్థితులు దాపురిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. డిప్లొమా విద్యార్థులకు ఎంతో కాలంగా అమల్లో ఉన్న లాటరల్ ఎంట్రీ విధానాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. 1957 నుంచి ఎంతో మంది సాంకేతిక నిపుణులను తీర్చిదిద్దిన పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను కాపాడుకునేందుకు పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యారంగాన్ని దెబ్బతీసే చర్యలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోకపోతే విద్యార్థులతో కలిసి రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పాలిటెక్నిక్ కమిటీ సభ్యులు సలిగంటి జయదీప్, రామ్ చరణ్, సాయి రామ్, వడ్డేబోయిన యశ్వంత్, ముదిగొండ నిరీక్షణ, సన్నీ, స్నేహిత్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ