తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సైబర్ మోసాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం కళాశాలలో విద్యార్థిని, విద్యార్థులకు సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ సైబర్ నేరాల రూపాలు కూడా మారుతున్నాయని, ముఖ్యంగా విద్యార్థులు, యువత సోషల్ మీడియా, ఆన్లైన్ సేవలను వినియోగించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టడం, నకిలీ పోలీస్ లేదా ప్రభుత్వ అధికారులుగా పరిచయం చేసుకోవడం, పెట్టుబడులపై అధిక లాభాలు వస్తాయని నమ్మించి మోసం చేయడం, నకిలీ యాప్లు, లింకుల ద్వారా డబ్బులు కాజేయడం వంటి మోసాలకు సైబర్ నెరగాళ్లు పాల్పడుతున్నారని వివరించారు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.విద్యార్థులు తమ వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, వీడియోలు, పాస్వర్డ్లు, ఓటిపిలు తదితర సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని, అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయవద్దని సూచించారు. సోషల్ మీడియాలో పరిచయం లేని వ్యక్తులతో చాటింగ్ చేయడం, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం వల్ల ఫొటో మార్ఫింగ్, ఆన్లైన్ వేధింపులు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని తెలియజేశారు.అదేవిధంగా సినిమాల్లో కనిపించే ప్రతి విషయాన్ని అనుకరించకుండా, మంచి విషయాలను మాత్రమే స్వీకరించి చెడు ప్రభావాలకు దూరంగా ఉండాలని తెలిపారు.మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేయడంతో పాటు కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. స్నేహితుల ఒత్తిడి, సరదా లేదా ఇతర కారణాలతో డ్రగ్స్కు అలవాటు పడవద్దని, మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను గుర్తించి, వారి ఆశయాలకు అనుగుణంగా కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులను సంప్రదించాలని సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక మరియు ఇతర సృజనాత్మక కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొని తమ ప్రతిభను పెంపొందించుకోవాలని సూచించారు. క్రమశిక్షణ, సామాజిక బాధ్యత వంటి మంచి విలువలను అలవర్చుకుని సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు విద్యార్థులతో నేరుగా ఇంటరాక్ట్ అవుతూ ప్రశ్నోత్తర కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన వివిధ ప్రశ్నలకు సమాధానాలు అందిస్తూ సైబర్ నేరాలు, సోషల్ మీడియా, డ్రగ్స్, పోక్సో, వ్యక్తిగత భద్రత తదితర అంశాలపై మరింత అవగాహన కల్పించారు.సైబర్ మోసాలకు గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. విద్యార్థులు, యువత అప్రమత్తంగా ఉంటూ సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలు మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పి ఆదినారాయణ, సీఐ ఆర్ వెంకటేశ్వర్లు, ఎస్సైలు రమణారెడ్డి, జుబేదాబేగం, కళ్యాణి, రమాదేవి, కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ