తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కాలేజీ తరలింపు కుట్రకు స్వస్తి చెప్పండి.జిల్లా విద్యార్థులకు అన్యాయం చేస్తే ఉద్యమం తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వర్క అజిత్.కళాశాల తరలింపు నిలిపివేయాలని కలెక్టర్'కు ఏఐఎస్ఎఫ్ వినతిపత్రం.జిల్లాకు మంజూరైన బీసీ సంక్షేమ గురుకుల బాలుర డిగ్రీ కళాశాలను ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలను తక్షణమే నిలిపివేయాలని ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వర్క అజిత్ డిమాండ్ చేశారు. గురుకుల డిగ్రీ కళాశాల తరలింపును అడ్డుకోవాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్'కు వినతిపత్రం అందజేసి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2023లో భద్రాద్రి జిల్లా కేంద్రానికి మంజూరైన బీసీ గురుకుల డిగ్రీ కళాశాలను నిబంధనలకు విరుద్ధంగా అన్నపురెడ్డిపల్లిలోని శిథిలావస్థకు చేరిన పాత సత్రం భవనంలో ఏర్పాటు చేయడం శోచనీయమన్నారు. ప్రస్తుతం కొందరు స్వార్థపూరిత శక్తులు అధికారులపై ఒత్తిడి తెచ్చి ఈ కళాశాలను మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు తరలించేందుకు తెరవెనుక కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే ప్రస్తుత విద్యాసంవత్సరం మొదటి సంవత్సరం ప్రవేశాలను ఉద్దేశపూర్వకంగా రద్దు చేస్తూ, ఉన్న విద్యార్థులకు టీసీలు ఇచ్చి పంపే యత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కొత్తగూడెం రామవరంలోని నేతాజీ పాఠశాలలో 500 మందికి సరిపడా విశాలమైన ప్రభుత్వ భవనం అందుబాటులో ఉందని, తక్షణమే అక్కడికి తరలించి రెగ్యులర్ తరగతులు నడపాలని కోరారు. జిల్లా విద్యార్థుల హక్కులను కాలరాస్తూ విద్యాసంస్థను తరలించాలని చూస్తే విద్యార్థి లోకం చూస్తూ ఊరుకోదని, తల్లిదండ్రులను కలుపుకుని జిల్లావ్యాప్త ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వినతిపత్రం సమర్పించినవారిలో నాయకులు మర్మం ఉమా మహేష్, కళ్యాణ్ రాజేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ