తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికలు విజయవంతంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు .జిల్లాలో తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికలను పూర్తిస్థాయిలో, ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా మరియు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. జూలూరుపాడు, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, ఇల్లందు, అల్లపల్లి, గుండాల, టేకులపల్లి మండలాల్లో తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో సంబంధిత అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.మంగళవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, జనరల్ అబ్జర్వర్ సర్వేశ్వర్ రెడ్డి, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ లావణ్య, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పోలీసు అధికారులు, ఎన్నికల సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎన్నికల ఏర్పాట్లను సమగ్రంగా సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా జిల్లాలోని ఏడు మండలాల్లో మొత్తం 155 గ్రామపంచాయతీలు, 1,330 వార్డులు ఉన్నాయని తెలిపారు. 155 గ్రామపంచాయతీలకు గాను రెండు గ్రామపంచాయతీలలో నామినేషన్లు దాఖలు కాలేదని, 8 గ్రామపంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయని, మిగిలిన 145 గ్రామపంచాయతీలలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అలాగే 1,330 వార్డులకు గాను మూడు వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదని, 256 వార్డులు ఏకగ్రీవమయ్యాయని, మిగిలిన 1,071 వార్డులలో ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు గాను అవసరమైన సిబ్బంది సామాగ్రిని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ద్వారా అన్ని పోలింగ్ కేంద్రాలకు తరలించడం జరిగిందని తెలిపారు.రేపు జరిగే పోలింగ్ సందర్భంగా అన్ని ఎన్నికల సిబ్బంది ఉదయం 7 గంటల కంటే ముందుగానే పోలింగ్కు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రతి ఓటరును నిశితంగా పరిశీలించి పోలింగ్ కేంద్రంలోకి అనుమతించాలని, బ్యాలెట్ పేపర్లపై ఉన్న గుర్తులను సిబ్బంది జాగ్రత్తగా పరిశీలించుకోవాలని సూచించారు. పోలింగ్ అనంతరం కౌంటింగ్ ప్రక్రియను రిటర్నింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల్లో అనవసరమైన ఇతర సామాగ్రి ఏదీ ఉండకుండా కట్టుదిట్టమైన నియంత్రణ పాటించాలని ఆదేశించారు.సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల ఫలితాలు పూర్తయిన వెంటనే ఉపసర్పంచ్ ఎన్నిక ప్రక్రియను చేపట్టాలని జిల్లా కలెక్టర్ సూచించారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ తప్పనిసరిగా చేయాలని ఆదేశించారు.కౌంటింగ్ పూర్తైన అనంతరం బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు తదితర ఎన్నికల సామాగ్రిని పూర్తిగా స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం, అవకతవకలు లేదా పొరపాట్లు చోటుచేసుకుంటే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్ నివేదికలను సమయానుసారం ఎటువంటి అంతరాయం లేకుండా టి–పోల్ యాప్లో నమోదు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో వెబ్కాస్టింగ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ జరిగే విధంగా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలకు కట్టుబడి, ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా గ్రామపంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా, పారదర్శకంగా మరియు విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛాయుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ , తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసు శాఖ పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సమస్యాత్మక మరియు అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి అదనపు పోలీసు బలగాలను మోహరించినట్లు చెప్పారు. పోలింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొబైల్ పట్రోలింగ్, చెక్ పోస్టుల ఏర్పాటు ద్వారా కట్టుదిట్టమైన నిఘా కొనసాగిస్తామని వెల్లడించారు. ఎన్నికల నియమ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ