తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బాలల భద్రత, విద్య, ఆరోగ్యం అందేలా సమగ్ర చర్యలు – కలెక్టర్ అంకిత్ చైల్డ్ రైట్స్పై ఉమ్మడి ఖమ్మం జిల్లా సమీక్షా సమావేశం నిర్వహణ ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో బాలల హక్కుల పరిరక్షణ, సంక్షేమ కార్యక్రమాల అమలు, బాలల భద్రతపై సమగ్ర సమీక్ష నిర్వహించేందుకు బాలల హక్కులపై సమీక్ష సమావేశం గురువారం ఐ డి ఓ సి కార్యాలయం సమావేశ మందిరం లో నిర్వహించబడింది. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ సిబ్బంది, పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలల హక్కుల కమిషనర్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రుల అవగాహనతోనే సమాజంలో మార్పు సాధ్యమని స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో మత్తు పదార్థాల నియంత్రణ, మరుగుదొడ్ల వినియోగం, బాల్య వివాహాల నివారణ, లింగ నిర్ధారణ కేసుల అరికట్టడంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి కమిషన్కు తెలియజేస్తే తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు పిల్లల ఎదుగుదలకు కీలకమని పేర్కొంటూ పోషకాహారం, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. జిల్లా పర్యటనలో భాగంగా ములకలపల్లి ధర్మన్న నగర్లో అంగన్వాడీ కేంద్రం లేకపోవడం గమనించామని, అటవీ శాఖ అనుమతుల సమస్యల కారణంగా పిల్లలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అవసరమైతే కంటైనర్ అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సీజన్ సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే వ్యవసాయ కూలీల పిల్లల సమస్యల పరిష్కారానికి అంతర్రాష్ట్ర స్థాయిలో సమన్వయం అవసరమని తెలిపారు .
జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ బాలల భద్రత, విద్య, ఆరోగ్యం అందేలా సమగ్ర చర్యలు చేపడుతున్నామని తెలిపారు. జిల్లాలో బాలసదన్ ద్వారా పిల్లల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని, 1098 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పిల్లల సమస్యలపై తక్షణ స్పందన అందిస్తున్నామని చెప్పారు. అంగన్వాడీ నుండి కళాశాల స్థాయి వరకు మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. జిల్లాలో పదో తరగతి ఉత్తీర్ణతలో బాలికలు ముందంజలో ఉన్నారని, గిరిజన ఆశ్రమ పాఠశాలలతో పాటు అన్ని పాఠశాలల్లో పోషకాహారం అందిస్తున్నామని తెలిపారు. ఏప్రిల్ 23 తరువాత బడిబాట కార్యక్రమం ద్వారా మారుమూల ప్రాంతాల్లో డ్రాప్ అవుట్లపై ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నామని తెలిపారు . పాఠశాలలు, కళాశాలల పర్యవేక్షణ కోసం మండల స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించి నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకంపై క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తూ సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో సికిల్ సెల్ అనీమియా నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టి హెల్త్ క్యాంపుల ద్వారా కేసులను గుర్తించి వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో బాల్య వివాహాల నివారణతో పాటు గంజాయి, మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ జిల్లాలో నమోదైన పోక్సో, బాల్య వివాహ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో గిరిజన అటవీ ప్రాంతాల్లో గంజాయి రవాణా, వినియోగంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ కార్యక్రమాల ద్వారా గల్లంతైన పిల్లలను గుర్తించి రక్షణ చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.ఈ సందర్భంగా 2023, 2024, 2025 సంవత్సరాలలో జిల్లాలో నమోదైన పోక్సో, బాల్య వివాహాలు తదితర కేసుల వివరాలను సమగ్రంగా వివరించారు. ఈ సమావేశంలో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులు బాలల హక్కుల పరిరక్షణకు చేపడుతున్న కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కమిషన్కు వివరించారు. బాలల హక్కుల పరిరక్షణలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రతి బాలుడికి సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు కట్టుబడి పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు. అనంతరం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల ద్వారా బాలల హక్కుల పరిరక్షణకు చేపడుతున్న కార్యక్రమాలు, తీసుకోవలసిన చర్యలపై సమగ్రంగా చర్చించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, కమిటీ మెంబర్లు కంచికచర్ల వందన గౌడ్, చందన, అపర్ణ, గోగుల సరిత, ప్రేమలత, వచన్ కుమార్, భరత రాణి, సుమిత్ర దేవి, సాధిక్ భాష, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని స్వర్ణలత లెనినా, ఖమ్మం మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి విజేత, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ