తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో ఇంటర్మీడియట్, పదోతరగతి ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న సప్లమెంటరీ క్యాంపులు, పాఠశాలల మౌలిక సదుపాయాలు, అలాగే ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యాశాఖ చేపడుతున్న పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎంఈఓలు, విద్యాశాఖ అధికారులు, ఇంటర్మీడియట్ అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మండలాల వారీగా ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థుల వివరాలను సేకరించి, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. భద్రాచలం, పాల్వంచ, చంద్రుగొండలో నిర్వహిస్తున్న సప్లమెంటరీ క్యాంపుల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని సమీక్షించి, ప్రతి విద్యార్థి ఈ క్యాంపులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.మే 13 నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని, ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని తెలిపారు. ఈ తరగతుల ద్వారా విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని, ప్రతి విద్యార్థి హాజరు మరియు అభ్యాస పురోగతిపై అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు.జిల్లా వ్యాప్తంగా పదోతరగతి ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం కూడా సమ్మర్ క్యాంపులు నిర్వహించాలని, మండలాలు మరియు పాఠశాలల వారీగా ఫెయిల్ విద్యార్థుల వివరాలతో సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ క్యాంపుల ద్వారా విద్యార్థుల లోపాలను గుర్తించి, లక్ష్యబద్ధంగా బోధన చేపట్టి ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.జిల్లాలోని పాఠశాలల్లో వివిధ దశల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై సమగ్రంగా సమీక్ష నిర్వహించిన కలెక్టర్, అన్ని పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాలల పునః ప్రారంభానికి ముందే పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుదీకరణ వంటి మౌలిక వసతులు 100 శాతం అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మే 12 నుండి విద్యాశాఖ ద్వారా చేపట్టబడుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి విజయవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ సమావేశంలో అధికారులు తమ మండలాల్లో చేపడుతున్న చర్యలపై వివరాలు తెలియజేయగా, కలెక్టర్ తగిన సూచనలు చేశారు. జిల్లాలో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం, విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచడం దిశగా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ