తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భారతీయ రిజర్వ్ బ్యాంక్ వారు ఈ రోజు భద్రాచలం గిరిజన భవన్ లో ఔత్సాహిక వ్యాపారవేత్తలకు బ్యాంకులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాలపై అవగాహన కల్పించే విధంగా ఎం.ఎస్. ఎం. ఇ. టౌన్ హాల్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ శ్రీ. ముత్యాల ఙ్ఞాన సుప్రభాత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎం. ఎస్. ఎం. ఇ) కార్యకలాపాలను ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయ ఆధార పరిశ్రమలు, వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెంది, నిరుద్యోగ సమస్య తీరడం తో పాటు, ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన ఉత్పత్తులు అందించే అవకాశం ఉందన్నారు. తద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడతాయని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఎం. ఎస్. ఎం. ఇ.లు కీలక పాత్ర పోషిస్తున్నాయని అయన పేర్కొన్నారు. అన్ని బ్యాంకులు తాము ఇచ్చే రుణాలలో ఎం. ఎస్.ఎం. ఇ కొరకు కేటాయించిన లక్ష్యాలు సాధించాలని ఆయన సూచించారు.ప్రతి ఒక్కరూ సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే లింకులు, ఆఫర్ ల పట్ల జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు. సురక్షితమైన, అధికారిక వెబ్ సైట్లు వాడాలని, పొరపాటున సైబర్ నేరగాళ్ల బారిన పడితే వెంటనే 1930 కి కాల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ బ్యాంక్ అధికారులు, వివిధ బ్యాంకుల అధికారులు, నాబార్డ్ జిల్లా అధికారి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి, లీడ్ బ్యాంక్ మేనేజర్, సెర్ప్ అధికారులు , సి. ఎఫ్.ఎల్ సిబ్బంది పాల్గొని వివిధ పథకాలు, అర్హత వివరాలు, దరఖాస్తు విధానం తెలియ చేశారు. భద్రాచలం పరిసర ప్రాంత ఔత్సాహిక వ్యాపారవేత్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Admin
తెలుగు వెలుగు టీవీ