తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : హక్కుల సాధనకు ఐక్యత అవసరం ఉపాధి హామీని నిర్వీర్యం చేయొద్దు గిరిజనుల సమస్యలపై రాజీలేని పోరాటం భవిష్యత్తు పోరాటాలకు సిద్ధం కావాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలంగాణ గిరిజన సమాఖ్య (టీజీఎస్) రాష్ట్ర మహాసభల ప్రారంభం సందర్భంగా పాల్వంచలో జరిగిన బహిరంగ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. అడవిపై ఆధారపడి బతుకుతున్న గిరిజన బిడ్డలపై అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గమన్నారు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. పాలకుల అణచివేత వైఖరిపై గిరిజన లోకం ఐక్యంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. ఈ మహాసభల ద్వారా గిరిజనులపై సమగ్ర కార్యాచరణను రూపొందించి, రాబోయే రోజుల్లో బలమైన పోరాటాలు నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన పూర్తిగా కుంటుపడిందని, విద్యా, వైద్య రంగాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ పరిధిలోని పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల పేద గిరిజన విద్యార్థుల భవిష్యత్తు అంధకారమవుతోందని మండిపడ్డారు. ప్రభుత్వాలు మారినా గిరిజనుల బతుకుల్లో మార్పు రావడం లేదని, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే పాలకులంతా వారిని వాడుకుంటున్నారని విమర్శించారు. గిరిజన సబ్ ప్లాన్ నిధులను ఇతర రంగాలకు మళ్లించడాన్ని తక్షణమే ఆపాలని, జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు జరపాలని డిమాండ్ చేశారు. అడవి బిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తాము ఎల్లప్పుడూ ముందుంటామని, శాసనసభ లోపలా, వెలుపలా వారి గొంతుకగా నిలుస్తానని హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు కొండంత అండగా ఉన్న ఉపాధి హామీ పథకం పేరు మార్చి, దానిని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. గిరిజన ప్రాంతాల్లో ఉపాధి కల్పనను దెబ్బతీసే ఇలాంటి ప్రజావ్యతిరేక నిర్ణయాలను తిప్పికొట్టాలన్నారు. గిరిజనుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో హక్కుల పరిరక్షణ కోసం భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలకు సిద్ధం కావాలని కోరారు. ఉపాధి హామీ నిధులను తగ్గించడం వల్ల వలసలు పెరిగిపోయే ప్రమాదం ఉందని, స్థానికంగానే పనిదినాలను 200 రోజులకు పెంచాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఐటీడీఏల పనితీరును మెరుగుపరచాలని, స్థానిక సంస్థలకు నిధులు, విధులను బదిలీ చేయాలని కోరారు. అటవీ హక్కుల చట్టం 2006ను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. పోడు భూముల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే వరకు తమ పోరాటం ఆగేది లేదని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసీలందరినీ ఏకం చేసి, హక్కుల సాధన కోసం అతిపెద్ద జాతీయ ఉద్యమాన్ని నిర్మిస్తామని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు అజ్మీరా రామ్మూర్తి నాయక్, రామావత్ అంజయ్య నాయక్, సీపీఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్ సీపీఐ రాష్ట్ర నాయకులు ముత్యాల విశ్వనాథం, కల్లూరి వెంకటేశ్వర్లు, నారాటి ప్రసాద్, సరిరెడ్డి పుల్లారెడ్డి, SD సలీం, సలిగంటి శ్రీనివాస్, మున్నా లక్ష్మీకుమారి, జిల్లా కార్యవర్గ సభ్యులు అడుసుమిల్లి సాయిబాబా, వీసంశెట్టి పూర్ణచంద్రరావు, వాసిరెడ్డి మురళి, ఉప్పుశెట్టి రాహుల్, మువ్వ వెంకటేశ్వర్లు, గిరిజన సమాఖ్య నాయకులు జువారి రమేష్ నాయక్, స్వరూప, సొందు కుటుంబరావు, భూక్యా శ్రీనివాస్, బి వెంకట్, బానోతు రాంబాబు, గణేష్, వివిధ జిల్లాల ప్రతినిధులు, స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ