తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఐ.డీ.ఓ.సీ సమావేశపు హాలులో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల నిర్వహణ, నిమజ్జన ఏర్పాట్ల పై సమావేశం ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. మంగళవారం ఐ.డీ.ఓ.సీ కార్యాలయంలోని సమావేశపు హాలులో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల నిర్వహణ, నిమజ్జన ఏర్పాట్లపై రెవెన్యూ, పోలీస్, పంచాయతి రాజ్, అగ్నిమాపక,ఐ.టీ.సీ,సింగరేణి, ఎక్సైజ్, విద్యుత్,ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించడానికి పకడ్బందీ చర్యలు తీసుకావాలని అన్నారు. అన్ని గణేష్ మండపాలను తప్పని సరిగా రిజిస్ట్రేషన చేసుకోవాలని సూచించారు.వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ముందస్తుగా గణేష్ మండలి నిర్వాహకులు పూర్తి వివరాలు అందించాలని, ఇది ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, మండల స్థాయిలో గణేష్ ఉత్సవాల నిర్వహణపై పోలీస్, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు సమావేశాలు నిర్వహించాలని పేర్కొన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు మొదటి రోజు నుండి నిమజ్జనం వరకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రశాంత వాతావరణంలో, అవాంచనీయ సంఘటనలు తావు లేకుండా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మండపాలకు విద్యుత్ ఏర్పాటుకు తప్పని సరిగా విద్యుత్ శాఖ నుండి అనుమతి తీసుకోవాలని చెప్పారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలుపై విద్యుత్ అధికారులు మండపాల్లో ఆడిట్ నిర్వహించాలని సూచించారు. విద్యుత్ తీగలకు తగల కుండా ఎత్తు తక్కువ ఉండే విగ్రహాలు ఏర్పాటు చేయాలని అన్నారు. మండపాల్లో మైక్ ఏర్పాటుకు పోలీస్ శాఖ అనుమతి తీసుకోవాలని తెలిపారు. భద్రాద్రి జిల్లా నుండే కాకుండా ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి నిమజ్జనానికి విగ్రహాలు వచ్చే అవకాశం ఉన్నందున యంత్రాంగం సూచించిన ప్రాంతాల్లో మాత్రమే అత్యంత భద్రత మధ్య నిమజ్జన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ తెలియజేసారు. గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ప్రణాళికరూపొందించుకోవాలని, విగ్రహాలను నిమజ్జనం చేసుకునేందుకు అవసరమైన రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని అధికారులను కోరారు. నిమజ్జనం రూట్ లో అవసరమైన రోడ్డు మరమ్మత్తు పనులు వెంటనే చేపట్టి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు.వినాయక నిమజ్జనానికి వినియోగించే వాహనాలను ముందస్తుగా రవాణాశాఖ అధికారి నుండి ధ్రువీకరణ తీసుకోవాలన్నారు. ప్రతి గణేష్ మండపం వద్ద అవసరమైన మేర బందోబస్తు ఏర్పాటు చేయాలని, గణేష్ నిమజ్జనం సజావుగా జరిగే విధంగా కట్టు దిట్టమైన భద్రత వ్యవస్థ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా భక్తిపాటలు మాత్రమే వినిపించాలని, మతాలు, వర్గాల మనోభావాలను గౌరవించాలని పేర్కొన్నారు. అధికారులు ఉత్సవ కమిటీ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని, గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా ఎలాంటి రెచ్చగొట్టే అంశాల జోలికి వెళ్లవద్దని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా జిల్లా యంత్రాంగానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు. అనంతరం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ..గణేష్ నిమజ్జనం సందర్భంగా క్రేన్లు వినియోగించాలని, గణేష్ నిమజ్జనం జరిగే ప్రదేశాలలో గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల సహకారంతో కలిసికట్టుగా పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని అన్నారు. భక్తులకు అందించే స్వామి వారి ప్రసాదాలకు ప్లాస్టిక్ వస్తువులు వినియోగించొద్దని పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని తెలిపారు. వ్యర్ధాలు వేసేందుకు డస్ట్ బిన్స్ ఏర్పాటు చేయాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులను పూజించాలని, రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసే విగ్రహాలు పర్యావణానికి హాని కలిగిస్తాయన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో ఉచిత మట్టిగణపతులు పంపిణీ చేయనున్నామని, ప్రజలు మట్టి విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వేణుగోపాల్,భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాళ్ శ్రేష్ఠ,డీ.ఆర్.ఓ పద్మావతి,డీ.టీ.ఓ వెంకట రమణ,జిల్లా ఇంచార్జ్ ఎక్సైజ్ ఈ.ఎస్ జానయ్య, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి క్రాంతి కుమార్, డీ.ఎం.హెచ్.ఓ డాక్టర్ తుకారాం రాథోడ్, విద్యుత్ శాఖ ఎస్.ఈ మహేంద్ర, కొత్తగూడెం మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ సుజాత,ఐటీసీ,సింగరేణి సంస్థ ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు,కొత్తగూడెం గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు యెర్రా కామేష్, సభ్యులు దారా రమేష్, లక్ష్మణ్,వందనపు శ్రీధర్,మహేష్,సుజాత,విజయలక్ష్మి, యాకయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ