తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నవజాత శిశువుల కంటి పరీక్షలు ప్రతి శిశువుకు తప్పనిసరిగా నిర్వహించాలి.నవజాత శిశువులలో పుట్టుకతో వచ్చే కంటి లోపాలను (నెలలోపు) ప్రారంభ దశలోనే గుర్తించి, వారికి సకాలంలో చికిత్స అందించేందుకు ప్రతి శిశువుకు జననం అనంతరం కంటి పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు.ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ N-BLESS కింద నిర్వహించిన యూనివర్సల్ న్యూ బోర్న్ బేబీస్ ఐ స్క్రీనింగ్ – ఆర్క్ లైట్ ఎగ్జామినేషన్ శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్ , అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, నవజాత శిశువులలో కంటి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించడం ద్వారా భవిష్యత్తులో అంధత్వాన్ని నివారించే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతి ఆరోగ్య కార్యకర్త శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి, ప్రతి శిశువుకు నాణ్యమైన కంటి పరీక్షలు నిర్వహించాలని సూచించారు.అదనపు కలెక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. నవజాత శిశువుల ఆరోగ్య పరిరక్షణలో ఆరోగ్య సిబ్బంది కీలక పాత్ర పోషించాలని అన్నారు.జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారం రాథోడ్ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆరోగ్య సంస్థల్లో జన్మించే ప్రతి నవజాత శిశువుకు ఆర్క్ లైట్ పరికరం ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి, అనుమానిత కేసులను వెంటనే ఉన్నత వైద్య కేంద్రాలకు రిఫర్ చేయాలని MLHPలు, ANMలకు సూచించారు. ఈ శిక్షణ ద్వారా ఆరోగ్య సిబ్బంది నైపుణ్యాలు మరింత మెరుగుపడి చిన్నారులకు నాణ్యమైన సేవలు అందుతాయని తెలిపారు.శిక్షణలో ఆర్క్ లైట్ పరికరం వినియోగం, రెడ్ రిఫ్లెక్స్ పరీక్ష, పుట్టుకతో వచ్చే కంటి లోపాల గుర్తింపు, రిఫరల్ విధానం వంటి అంశాలపై ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ నిపుణులు సవివరంగా అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, Dr రాందాస్ ప్రోగ్రాం ఆఫీసర్, Dr దినేష్ ప్రోగ్రాం ఆఫీసర్, ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు, జిల్లాలోని మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు (MLHPలు), ఏఎన్ఎంలు (ANMs) మరియు ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ