తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : స్వయం సహాయక సంఘాల ఎన్పీఏ రుణ ఖాతాలను తగ్గించాలి శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాలు, బ్యాంకర్ల జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన బ్యాంకు రుణాలు, రుణ బకాయిలు, ఎన్పీఏ ఖాతాలపై మండలాలు, సంఘాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వై.ఎన్. రెడ్డి జిల్లాలోని అన్ని బ్యాంకు శాఖల్లో స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన బ్యాంకు రుణాల ఎన్పీఏ ఖాతాల వివరాలను సమీక్షించారు. మండలాల వారీగా, సంఘాల వారీగా ఎన్పీఏ పరిస్థితిని పరిశీలించి, ఎన్పీఏను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఏపీఎంలు, బ్యాంకు శాఖల నిర్వాహకులకు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన మాట్లాడుతూ, ఏపీఎంలు, బ్యాంకు శాఖల నిర్వాహకులు సమన్వయంతో పనిచేసి స్వయం సహాయక సంఘాల ఎన్పీఏను తగ్గించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. మండలాలు, సంఘాల వారీగా రుణ ఖాతాలను పరిశీలించి, బకాయిల వసూళ్లకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సెప్టెంబర్ నెలాఖరు నాటికి ఎన్పీఏను పూర్తిస్థాయిలో తగ్గించేలా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. స్వయం సహాయక సంఘాలు తీసుకున్న బ్యాంకు రుణాలను సకాలంలో చెల్లించేలా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించాలని, రుణాల చెల్లింపులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. రుణ బకాయిలు ఉన్న సంఘాలను గుర్తించి, ఆయా సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా మాట్లాడి రుణాల చెల్లింపునకు కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. అవసరమైన చోట బ్యాంకర్లు, ఏపీఎంలు కలిసి సంఘాల సభ్యులకు రుణ చెల్లింపుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేయడంలో బ్యాంకు రుణాల సకాలంలో చెల్లింపు కీలకమని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. సంఘాలు రుణాలను సక్రమంగా వినియోగించుకొని, నిర్ణీత కాల వ్యవధిలో వాయిదాలను చెల్లించేలా ప్రోత్సహించాలని అన్నారు. ఎన్పీఏ తగ్గింపుతో పాటు భవిష్యత్తులో స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలు సులభంగా అందేలా నమ్మకాన్ని పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. బ్యాంకర్లు, స్వయం సహాయక సంఘాల సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేసి నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని, ప్రతి మండలంలో ఎన్పీఏ తగ్గింపుపై నిరంతరం సమీక్ష నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎల్డీఎం రామిరెడ్డి, పీఎం (బీఎల్) వీరమల్లు, పీఈ (బీఎల్) వెంకట్, అదనపు డీఆర్డీఓ నీలేష్, డీపీఎంలు, ఏపీఎం (బీఎల్), అన్ని బ్యాంకుల బ్రాంచ్ మేనేజర్లు, ఏపీఎంలు, సీసీలు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ