తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎల్నీనో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు పంటల మార్పిడి చేపట్టాలి ప్రీ-ప్రైమరీ ప్రవేశాలను రెండు రోజుల్లో పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ జిల్లా కలెక్టర్ అంకిత్ శుక్రవారం పాల్వంచ మండలంలో విస్తృతంగా పర్యటించి సారేకల్లు గ్రామంలో భూ రీ-సర్వే పనులను పరిశీలించారు. అనంతరం కోడిపుంజుల వాగు గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎల్నీనో ప్రభావంపై రైతుల అవగాహన సదస్సులో పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. అనంతరం కరకవాగు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యా ప్రమాణాలు, ప్రీ-ప్రైమరీ ప్రవేశాలపై అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా సారేకల్లు గ్రామపంచాయతీ పరిధిలో కొనసాగుతున్న భూ రీ-సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్, సంబంధిత అధికారులను పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూ రీ-సర్వే కార్యక్రమం ద్వారా భూముల హద్దులు ఖచ్చితంగా నిర్ధారించబడటంతో పాటు భూ రికార్డులు నవీకరించబడతాయని తెలిపారు. దీనివల్ల భూ వివాదాల పరిష్కారానికి దోహదపడటంతో పాటు భూ యజమానులకు పారదర్శకమైన రికార్డులు అందుబాటులోకి వస్తాయని అన్నారు . సర్వే పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, సర్వే నిర్వహణలో ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. ప్రజలతో సమన్వయం చేసుకుంటూ నిబంధనలకు అనుగుణంగా సర్వే నిర్వహించాలని సూచించారు. అధికారులు సారేకల్లు గ్రామపంచాయతీ పరిధిలో మొత్తం 28 సర్వే నంబర్లలో 84 ఎకరాల మేర భూ రీ-సర్వే కొనసాగుతోందని, రెండు రోజుల్లో పూర్తి చేస్తామని కలెక్టర్కు వివరించారు. అనంతరం కోడిపుంజుల వాగు గ్రామంలో నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ, ఎల్నీనో ప్రభావం కారణంగా వర్షపాతం తగ్గడంతో పాటు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నందున రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల మార్పిడి చేపట్టాలని సూచించారు. అధిక నీటి అవసరమున్న పంటలకు బదులుగా సజ్జలు, రాగులు, జొన్నలు, కొర్రలు, సామలు వంటి చిరుధాన్యాలు, కంది, పెసర, మినుము, నువ్వులు, పొద్దుతిరుగుడు వంటి తక్కువ నీటి అవసరమున్న పంటలను సాగు చేయాలని సూచించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న కూరగాయల సాగుపై దృష్టి సారించాలని, పంటల వైవిధ్యీకరణ, నీటి పొదుపు, శాస్త్రీయ సాగు విధానాలను అనుసరించడం ద్వారా ఎల్నీనో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని తెలిపారు. రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సాంకేతిక సూచనలను పాటిస్తూ సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. అనంతరం కరకవాగు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించి, ప్రతిరోజూ నాణ్యమైన, పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థుల హాజరు, బోధన విధానం, అభ్యాస స్థాయిని పరిశీలించారు. ఐదో తరగతి విద్యార్థులతో ఇంగ్లీష్లో మాట్లాడించి వారి భాషా నైపుణ్యాలను పరీక్షించారు. విద్యార్థుల్లో ఇంగ్లీష్ భాషా ప్రావీణ్యం పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణ అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.ప్రీ-ప్రైమరీ తరగతి గదిని పరిశీలించిన కలెక్టర్, ఆ విభాగంలో 20 మంది విద్యార్థులు ఉండాల్సిన లక్ష్యానికి గాను ప్రస్తుతం 14 మంది మాత్రమే చేరినట్లు గుర్తించారు. మిగిలిన విద్యార్థుల చేరికల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టి, రెండు రోజుల్లో ప్రీ-ప్రైమరీ ప్రవేశాలను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, హాజరు, బోధన నాణ్యత, అభ్యాస ఫలితాల మెరుగుదలకు అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో కొత్తగూడెం ఆర్డీవో మధు, పాల్వంచ తహసీల్దార్ ధారాప్రసాద్, కోడిపుంజుల వాగు గ్రామ సర్పంచ్ మహేశ్వరి, సర్వే అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, విద్యాశాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, రైతులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ